
తెలంగాణ రైజింగ్ విజన్ ఇదే..
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన సీఎ: రేవంత్ రెడ్డి.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ను రూపొందించింది. ఈ విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించారు. ఇందులో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి తమ ప్రభుత్వం వేయున్న అడుగులను వివరించారు. ఇందులో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన.. తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్.. 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన.. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణ.. 2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ టార్గెట్
రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ అని, ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్ మ్యాప్ అని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిత కోసం..ప్రజల భవిష్యత్తు కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో “తెలంగాణ రైజింగ్ 2047” డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్ తయారు చేసింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు.. ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించింది. అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది.
ఈ డాక్యుమెంట్ తయారీలో నీతి ఆయోగ్ (NITI Aayog) కీలక భూమిక నిర్వహించింది. ISB (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు.
వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వీటన్నింటినీ విశ్లేషించుకొని.. వడపోసి.. తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచింది.
ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం తెలంగాణ పురోగాభివృద్ధికి దోహదపడుతుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యం. దీంతో తెలంగాణ అభివృద్ధి లో ప్రపంచ దేశాల కు ధీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.
రాష్టం నలుమూలల అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు.. అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. 65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పన లో పాలుపంచుకున్నారు.
ఈ ఆర్ధిక వృద్ధికి మూడు మూల స్తంభాలు
ఆర్థిక వృద్ధి,
సమ్మిళిత అభివృద్ధి,
సుస్థిర అభివృద్ధి.
అదునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయి.
రాష్ట్రం లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి CURE-PURE-RARE అనే మూడు-జోన్ల అభివృద్ధి నమూనాను ఈ డాక్యుమెంట్ కీలకంగా ప్రస్తావించింది. హైదరాబాద్ సిటీ తో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పం.
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలు రాయి ని నిర్దేశించింది. 2047 నాటికి జాతీయ GDPలో తెలంగాణ వాటా పదో వంతు కు చేరాలని లక్ష్యం గా ఎంచుకుంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్న అత్యాధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దటం.
అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టడం .
లక్ష్య సాధనకు మూడు సూత్రాలు:
1. ఆర్థిక వృద్ధి (Economic Growth): ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం.
2. సమ్మిళిత అభివృద్ధి (Inclusive Development): యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం.
3. సుస్థిర అభివృద్ధి (Sustainable Development): అన్ని రంగాలలో సుస్థిరతను పొందుపరచడం, 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం.
*మూడు ఉత్ప్రేరకాలు:*
1. సాంకేతికత & ఆవిష్కరణ (Technology & Innovation): పాలన, పరిశ్రమలు, సేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
2. సమర్థవంతమైన ఆర్థిక వనరులు (Efficient Financing): పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం.
3. సుపరిపాలన (Good Governance): పారదర్శక, జవాబుదారీ, పౌర-కేంద్రీకృత పాలనను అందించడం.
మూడంచెల వ్యూహం: (CURE-PURE-RARE)
తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని మూడు విభిన్న, రంగాల వారీగా.. మూడు జోన్లుగా విభజన.
అభివృద్ధి ప్రామాణికంగా రాష్ట్రాన్ని మూడు జోన్లు గా విభజించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
ఈ విధానం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తుంది.
CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ):
160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతం. సేవల విస్తరణకు ప్రాధాన్యం. నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది.
PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ):
ఔటర్ రింగ్ రోడ్ (ORR), 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న జోన్. తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్లు ఏర్పాటు.
RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ):
ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి .
పది కీలక వ్యూహాలు
ఈ దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్ ప్రస్తావించింది.
1. 3-జోన్ల రాష్ట్రం: సమతుల్య అభివృద్ధికి CURE-PURE-RARE నమూనా.
2. విచక్షణ నుండి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.
3. గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్. రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు.
4. సమర్ధ పాలన: డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.
5. నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం .
6. సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అందరికీ సమాన అవకాశాలు.
7. అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.
8. పర్యావరణం, సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం.
9. సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. ప్రోత్సహించడం.
10. ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.

