కాలుష్య నివారణ చర్యలపై సీఎం రేవంత్ అధ్యయనం
x
కిటాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీతో సీఎం రేవంత్ రెడ్డి భేటి

కాలుష్య నివారణ చర్యలపై సీఎం రేవంత్ అధ్యయనం

జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కిటాక్యూషూ నగరాన్ని సందర్శించారు.కలుషిత నగరంలో కాలుష్య నివారణకు తీసుకున్న చర్యల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.


జపాన్ దేశంలోని ప్రఖ్యాత కిటాక్యూషూ నగరంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి స్థానిక జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులకు కిటాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ ఆత్మీయ స్వాగతం పలికారు.




కాలుష్య నివారణకు చర్యల గురించి సీఎంకు వివరించిన మేయర్

ఒకప్పుడు జపాన్‌ దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరంగా పేరుగాంచిన కిటాక్యూషూలో గాలి, నీరు, నేల అన్నీ తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన దుస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పర్యావరణ పరిరక్షణ విధానాలతో కిటాక్యూషూ నగరం కోలుకుంది. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యూషూ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది.కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యూషూ నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని అధికారుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది.


హైదరాబాద్‌లో ఎకో టౌన్

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది.

నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు

కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టేకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు.ఈ సందర్భంగా ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ , నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి.

హైదరాబాద్– కిటాక్యూషు విమాన సర్వీసు

హైదరాబాద్– కిటాక్యూషు రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్‌లో యువ శక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే, అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది, పరిశుభ్రమైన నదీతీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.


Read More
Next Story