
పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు: రేవంత్
పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో మావోయిస్టులకు రేవంత్ పిలుపు.
ప్రజలు ప్రశాంతంగా నిద్రించడం కోసం ప్రాణాలను పణంగా పెట్టే వారు పోలీసులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటం కోసం ఎందరో పోలీసులు ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. పోలీసులు అంటే ఒక ఉద్యోగం కాదని, సమాజం పట్ల బాధ్యత అని అన్నారు. ‘‘పోలీసు అంటే సమాజానికి నమ్మకం, భరోసా. వారి గౌరవం పెరిగితేనే ప్రభుత్వ గౌరవం పెరుగుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. మంగళవారం గోషామహల్ గ్రౌండ్లో పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సేవలను కొనియాడారు. ఈ సందర్బంగానే నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై స్పందించారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాంతో పాటుగా ప్రమోద్ కుటుంబానికి భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
నమ్మకానికి మారు రూపం పోలీస్
‘‘పోలీసు అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా... మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’న“పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Flag Day)”గా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా’’ అని అన్నారు.
ఎందరో పోలీసుల ప్రాణత్యాగాలు
‘‘పోలీసు అమరవీరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉంది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. వారందరికీ పేరు పేరునా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహౌండ్స్ కమాండోలు.. టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్లు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం చెందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడు రోజుల కింద నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారు’’ అని గుర్తు చేశారు.
ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండ
‘‘భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా… పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం. 29-06-2008 న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించాం’’ అని వెల్లడించారు.
దేశంలోనే తెలంగాణ పోలీస్ టాప్
‘‘తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం మా ప్రభుత్వానికి గర్వకారణం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అదేవిధంగా, పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇలాగే, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నా. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు’’ అని తెలిపారు.
డ్రగ్స్కు ఈగల్తో బదులు
‘‘తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ (Elite Action Group for Drug Law Enforcement) వింగ్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేష్’’ అని కొనియాడారు.
మావోయిస్ట్లు అరణ్యం వీడాలి
‘‘మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచిస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసిన అధికారుల కృషిని మా ప్రభుత్వం గుర్తించింది. పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది’’ అని చెప్పారు.