సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలో కలకలం
x
Secunderabad military college

సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలో కలకలం

గేటుదగ్గర ఐడీకార్డులు చూపటంతో సెక్యూరిటి అందరినీ లోపలకు అనుమతించారు


గుర్తుతెలీని నలుగురు సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజీలో ప్రవేశించటం కలకలం రేపింది. మిలిటరీ అధికారుల యూనిఫారమ్ లో కాలేజీలోకి నలుగురు ప్రవేశించి ఫొటోలు, వీడియోలు తీయటంతో అనుమానం వచ్చిన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ టీ షర్టులు ధరించి అనధికారికంగా ప్రవేశించిన నలుగురిని సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్(Secunderabad) లోని ఎంసీఈఎంసీఈలోని టెక్నోచౌక్ గేటు వైపు నుండి నలుగురు మిలిటరీ కాలేజీ(Military college)లోకి ప్రవేశించారు. గేటుదగ్గర ఐడీకార్డులు చూపటంతో సెక్యూరిటి అందరినీ లోపలకు అనుమతించారు.

లోపలకు ప్రవేశించిన వీరు ఆర్మీ క్యాంటిన్ తో పాటు కొన్ని నిషిద్ధ ప్రాంతాల్లో తిరుగుతు ఫొటోలు, వీడియోలు తీయటాన్ని ఆర్మీ సిబ్బంది గమనించారు. ఈనలుగురు దగ్గరకు వచ్చిన సిబ్బంది ఎవరని ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవటంతో ఐడీ కార్డులు చూపించాలని అడిగారు. వీళ్ళు చూపించిన ఐడీ కార్డులను చూడగానే అవి నకిలీవని అర్ధమైపోయింది. దీంతో వీళ్ళందరినీ సిబ్బంది లెఫ్టినెంట్ కల్నల్ దగ్గరకు తీసుకెళ్ళారు. లెఫ్ట్ నెంట్ కల్నల్ ఇదే విషయాన్ని తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదుచేయటంతో అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విచారణలో ఇద్దరు అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు యువకులు డబ్బులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమమీద అమ్మాయిలకు నమ్మకం కలిగించి మరింత డబ్బులు గుంజేందుకు నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డులు ప్రింట్ చేయించి ఆర్మీ డ్రస్సులో అమ్మాయిలను తీసుకుని బిల్డప్ ఇవ్వటానికి కాలేజీలోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు నిందితులు ఆర్మీ కాలేజీలోకి అక్రమంగా ప్రవేశించటమే కాకుండా నిషిద్ధ ప్రాంతాల్లో తిరిగి ఫొటోలు, వీడియోలు తీయటం కలకలం రేపుతోంది. ఇది ఉత్త మోసం కేసేనా లేకపోతే దీనివెనుక ఇంకేదైనా ఉందా అన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read More
Next Story