‘ఇచ్చింది 30 పైసలు.. ఎగ్గొట్టింది 70 పైసలు’
x

‘ఇచ్చింది 30 పైసలు.. ఎగ్గొట్టింది 70 పైసలు’


కేసీఆర్ హయాంలో రాజులా బతికిన రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో బానికన్నా హీనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో వేసవిలో కూడా పంటలు సాగుకు కావాల్సిన నీరు అందించామని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. కేసీఆర్ రాజ్యంలో కాళేశ్వరం నీటితో పంటలను సాగు చేసిన రైతులు ఇప్పుడు తమ కన్నీటితో సాగుచేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా మోసం చేసిందని, వారికి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. గతంలో హల్దీ వాగులో లిఫ్ట్ పెట్టి గద్దర్ వాళ్ల ఊరికి నీరందించామని గుర్తు చేశారు. కేసీఆర్ పాలన చూసి గద్దర్ కూడా మెచ్చుకున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి నేత, కార్యకర్త శ్రమించాలని, అన్ని మండలాల్లో పార్టీ జెండాను ఎగరేయాలని కోరారు. కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందిందని, కానీ ఇప్పుడు పతనమైందని వ్యాఖ్యానించారు. భూముల ధరలు తీవ్రంగా పడిపోయాయని చెప్పారు.

‘‘రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించాం. ఆగస్టు 15న 22.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణవిముక్తులను చేశాం’’ అని కాంగ్రెస్ చెప్పుకోవడం తప్ప.. ఏ రైతు కూడా తనకు పూర్తి రుణమాఫీ అయిందని చెప్పలేదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ సర్కార్.. 30 పైసలు రుణామాఫీ చేసి 70పైసల రుణమాఫీని ఎగొట్టిందని చురకలంటించారు. యాసంగికి సంబంధించి సన్న వడ్లకు బోసస్‌ రాలేదని విమర్శించారు.

‘‘ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్ లు ఉంటే, 16, 18 పరిషత్ లు బిఆర్ఎస్ సొంతం చేసుకోబోతున్నది. సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉంటే, మెజార్టీ మండలాల్లో గెలవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఒక కుటుంబం లాగా పని చేయాలి. ఆత్మ విశ్వాసం ఉండాలి కానీ, అతి విశ్వాసం ఉండకూడదు. ఎట్లుండె తెలంగాణ ఎట్ల అయ్యింది అనేది ప్రజలకు అర్థం అయ్యేటట్లు చెప్పాలి. ఆరోజు నీళ్ళు ఎట్ల వచ్చాయి, ఈ రోజు మంచి నీళ్లు ఎట్ల వస్తున్నయి. కేసీఆర్ ఉండగా, ఇంటింటికి వచ్చి చెత్త తీసుకుపోయే వారు ఇప్పుడు దిక్కులేదు. డీజిల్ పోయించేందుకు పైసలు లేక తాళాలు అప్పజెప్పి వెళ్లిపోయిన పరిస్థితి లేదు’’ అని అన్నారు.

‘‘చెత్త ఎత్తెటోళ్లు లేరు, బుగ్గలు వేసేవాళ్లు లేరు, మంచి నీళ్ల పైపు పగిలిపోతే అతుకపెట్టేవాడు లేడు. కొత్తగ చేసింది లేదు, ఉన్నది నడిపించే సత్తా లేదు. ఇవన్నీ స్వీయ అనుభవంలో ఉన్నవే. ప్రజలకు గుర్తు చేస్తే చాలు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని మాట తప్పిండు. 12వేల ఉద్యోగాలు ఇచ్చి, 60వేలు ఇచ్చినం అని అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నరు. కేసీఆర్ 1.68వేల ఉద్యోగాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి అశోక్ నగర్ లోని విద్యార్థులు, నిరుద్యోగులు సిద్దమయ్యారు’’ అని అన్నారు.

‘‘రాహుల్ గాంధీ పత్తా లేడు, రేవంత్ రెడ్డి పోలీసు వలయం పెట్టుకొని తిరుగుతున్నడు. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతా అని మోసం చేసిండు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు, కాని రకరకాల కారణాలు చెప్పి 2లక్షల పింఛన్లు కోత పెట్టిండు. అవ్వాతాతలకు ఇద్దరికి పింఛన్లు ఇస్తమని మాట తప్పిండు రేవంత్ రెడ్డి. నాలుగు వేల పెంపు దేవుడెరుగు 20నెలల్లో రెండు నెలల పింఛన్లు ఎగ్గొట్టిండు’’ అని విమర్శించారు.

‘‘రైతులను దగా చేసిండు రేవంత్ రెడ్డి. బోనస్ పేరిట చెల్లిస్తామన్న 1200 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. యూరియా కోసం పాస్ పుస్తకాలు, చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి. బిఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ఎరువుల కోసం లైన్ల నిలబడ్డరా? కాంగ్రెస్ వచ్చింది మల్లా రైతులకు తిప్పలు మొదలైనయి. కరోనా వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలేదు. 11 విడతల్లో 73వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య ఇస్తే, రేవంతు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు బంధు ఇస్తున్నడు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు బంధు ఎగ్గొట్టిండు. రైతు బంధు సకాలంలో, సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలె. జనుము, జీలుగు విత్తనాలు కూడా కాంగ్రెస్ పాలనలో దొరకని పరిస్థితి. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, కరెంటు.. ఇవేవి ఇవ్వలేని చేతగాని సర్కారు కాంగ్రెస్. రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? రైతులతో చర్చ పెట్టాలె. వారికి అన్ని గుర్తు చేయాలె’’ అని అన్నారు.

‘‘ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చు అని నాడు చంద్రబాబు అన్నడు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే, ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చే పరిస్థితి వచ్చిందన్నడు. కానీ ఇప్పుడు రేవంతు సీఎం అయ్యాక సీన్ మల్లా రివర్స్ అయ్యింది. పెండ్లికోసమో, చదువుల కోసమో భూములు అమ్ముకునే పరిస్థితి లేదు. ఇంకో రెండు యేండ్లు కాంగ్రెస్ పాలన ఉంటే భూముల రేట్లు సగానికి సగం అవుతాయి. రెండేండ్లలో తెలంగాణ ఆగమైంది. పాలన చేతగాదు, దిక్కుమాలిన మాటలు, అడిగితే కేసులు. ప్రజలందరూ కేసీఆర్ మల్లా రావాలని, సీఎం కావాలని కోరుకుంటున్నారు’’ అని తెలిపారు.

‘‘ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తానన్నడు, 20 నెలల్లో 50వేల బాకీ పడ్డడు. తులం బంగారం అన్నడు మాట తప్పిండు. ఆడపిల్లలకు స్కూటీ అని మాట తప్పిండు. కేసీఆర్ కిట్ బందు పెట్టిండు. మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. కోటి మందిని కోటీశ్వరులు చేస్తానన్నడు. బిఆర్ఎస్ హయాంలో లాగే 5లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తూ, 20లక్షల వడ్డీ లేని రుణాలు అని ప్రచారం చేసుకుంటున్నరు. దీనికి సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారు. యువత, రైతులు, మహిళలు.. అన్ని వర్గాలను మోసం చేసిండు రేవంత్’’ అని ఆరోపించారు.

‘‘మన జిల్లా మీద పగబట్టినట్లు చేస్తున్నారు. ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. నిధులు జిల్లాకు ఆపారు. అందరం కలిసి పని చేయాలి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలి. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ గజ్వెల్. గజ్వెల్ ప్రతిష్టను పెంచింది కేసీఆర్. అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గులాబి జెండా ఎగరాలి, అందరు కలిసి పని చేయాలె’’ అని పిలుపునిచ్చారు.

Read More
Next Story