కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
x
వాసాలమర్రి గ్రామం

కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న గ్రామం వాసాలమ‌ర్రిలో గత ప్రభుత్వం కూల్చిన ఇళ్ల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది.


కేసీఆర్ దత్తత గ్రామం అయిన వాసాలమర్రిలో ఇళ్లలో సగభాగాన్ని కూల్చివేశారు.గతంలో అధికారులు కూల్చిన ఇళ్ల యజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఇళ్ల మంజూరు ప‌త్రాలను తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గురువారం వాసాలమర్రి వాసులకు అందజేశారు.

భ‌వ‌న‌గిరి జిల్లా వాసాల‌మ‌ర్రి గ్రామంలో ఇళ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ. హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు.

ఫాం హౌస్ రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు కూల్చి...
కేసీఆర్ తన ఫాం హౌస్ ఎర్రవెల్లికి వెళ్లే రోడ్డును విస్తరించేందుకు దారిలోని వాసాలమర్రి గ్రామంలో రోడ్ల పక్కన ఉన్న ఇళ్లను సగం కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని హామి ఇచ్చారు.కానీ ఇళ్లు కూల్చి ఏళ్లు గడచినా సీఎంగా దిగిపోయే దాకా వాసాలమర్రిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో గ్రామంలో తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలు, టెంట్లలోనే ప్రజలు నివాసముంటున్నారు.

వాసాలమర్రి దత్తత తీసుకున్నానన్నారు...ఇళ్ల నిర్మాణం మరిచారు
వాసాలమర్రి గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు అప్పటి సీఎం కేసీఆర్ 2020 నవంబరు 1వతేదీన ప్రకటించారు. 2021 జూన్ 22వతేదీన గ్రామంలో గ్రామ సభ నిర్వహించి బంగారు వాసాలమర్రిగా చేస్తానని ప్రతీ కుటుంబానికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తానని కేసీఆర్ హామి ఇచ్చారు. “వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు 2020 న‌వంబ‌ర్ 1న ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ ఆనాడు ప్ర‌క‌టించారు. 2021 జూన్ 22న గ్రామ‌స‌భ నిర్వ‌హించి స్ధానికుల‌తో సహ‌పంక్తి భోజ‌నం చేశారు. బంగారు వాసాల‌మ‌ర్రిగా అభివృద్ది చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ప్ర‌తి కుటుంబానికి డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు క‌ట్టించి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ వాస్త‌వంగా ఆరోజు నుంచి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయే 2023 డిసెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు వాసాల‌మ‌ర్రి వైపు క‌న్నెత్తి చూడ‌లేదు’’అని మంత్రి విమ‌ర్శించారు.



205 మందికి ఇందిరమ్మ ఇళ్లు

బంగారు వాసాలమ‌ర్రి దేవుడెరుగు.. ఉన్న ఇళ్లను కోల్పోయామ‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వాసాల‌మ‌ర్రి గ్రామంలో స‌ర్వే నిర్వ‌హించి ఇందిర‌మ్మ ఇళ్లకు అర్హుల‌ను గుర్తించి పట్టాలు ఇచ్చామని మంత్రి చెప్పారు.అర్హులైన 205 మందికి ఇందిర‌మ్మ ఇళను మంజూరు చేశారు. ‘‘ కేసీఆర్ ద‌త్త‌త గ్రామ ప్ర‌జ‌ల‌కు పంగ‌నామాలు పెట్టారు. కొత్త ఇల్లు రాలేదు.. ఉన్న ఇల్లు పోయింది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆశ‌ల‌ను వారి రాజ‌కీయ అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వాడుకున్నార‌ని చెప్ప‌డానికి వాసాలమ‌ర్రి గ్రామ‌మే ఒక నిద‌ర్శ‌నం" అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.



Read More
Next Story