మధ్యలోనే ఎన్నికలు.. 100 శాతం మనదే సర్కార్
x

'మధ్యలోనే ఎన్నికలు.. 100 శాతం మనదే సర్కార్'

తెలంగాణలో కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ లపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండదని, మధ్యలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమాగా చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చాం, 24 గంటల కరెంటు ఇచ్చాం, రైతుబంధు ఇచ్చాం, రైతుల దగ్గర నుంచి పంటలు కొన్నామన్నారు. తెలంగాణలో హుజురాబాద్ రైతులు ఆత్మగౌరవంతో ఉన్నారని కేసీఆర్ అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ మాయమాటలు నమ్మారు కానీ ఇకపై మోసపోరని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ నుండి 12 నుండి 14 మంది ఎంపీలు పార్లమెంటులో ఉంటే రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై బలంగా ప్రశ్నించొచ్చు అన్నారు. రాష్ట్రంలో లేక, కేంద్రంలో కూడా లేకపోతే ఆగమైపోతం.. అప్పుడు మనల్ని కాపాడేది ఎవరు అని ఓటర్లను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నుంచి తంబాకు నమిలే సంజయ్ అనే సన్నాసిని గెలిపిస్తే ఏం చేశాడో మీ అందరికీ తెలుసు అన్నారు. ఆ పంచాంగాలు, పంచాయితీలు మనకు వద్దని విద్యవంతుడైన వినోద్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Read More
Next Story