ఫోన్ ట్యాపింగ్ నిందితులకు కోర్టులో ఎదురుదెబ్బ
x

ఫోన్ ట్యాపింగ్ నిందితులకు కోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నిందితులకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది.


తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నిందితులకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లను నాంపల్లి న్యాయస్థానం డిస్మిస్ చేసింది. 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయనందున బెయిల్ కావాలని నిందితులు కోర్టుని కోరారు. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదనల సమయంలో కోర్టుకి తెలిపారు. అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వొచ్చని వాదించారు.

అయితే, తాము 90 రోజుల లోపే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఛార్జిషీట్ ని కోర్టు తిప్పి పంపించిందని, ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది.

వీసా గడువు పొడిగించుకున్న ప్రభాకర్ రావు?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆయనపై కేసు నమోదైంది. ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఇప్పటికే ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన వీసా గడువు ముగిసిందని ఎప్పుడైనా ఇండియాక రావొచ్చని భావిస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం వచ్చానని పోలీసులకు అందుబాటులో ఉంటానని జూన్ 26న భారత్ కు వస్తానని అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే ఆయన రాలేదు. వీసా గడువు పొడిగించుకుని ఉండవచ్చని చెబుతున్నారు. మరో నిందితుడు శ్రవణ్ రావుకు కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

మూడు బాక్సుల్లో ఆధారాలు...

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించారు. మూడు బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్ లు, సిడీలు, పెన్ డ్రైవ్ లు ఉన్నాయి. ఈ మెటీరియల్ ఎవిడెన్స్ లు లేని కారణంగా రెండు సార్లు చార్జిషీటును కోర్టు వెనక్కి పంపింది. ఆధారాలు అన్నిటినీ జత పరుస్తూ పోలీసులు మూడోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఆధారాలను నిందితులకు తెలీకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజునే ఆధారాలన్నీ శ్రవణ్ రావు ధ్వంసం చేసినట్లుగా తెలియడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read More
Next Story