
కర్రెగుట్ట నుంచి సరిహద్దు బాట పట్టిన భద్రతా దళాలు
దళాలు వెనక్కి వెళ్తున్నంత మాత్రాన ఆపరేషన్ కగార్ ఆగదని అధికారులు చెప్పారు.
మావోయిస్ట్లను అంతమొందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను ప్రారంభించింది. అందులో భాగంగా కొంతకాలంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఆ అడవుల్లో భారీ సంఖ్యలో మావోలు ఉన్నారని సమాచారం రావడంతో ఈ ఆపరేషన్ను ప్రారంభించాయి. కాగా ఇప్పుడు భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కగార్ ఆపరేషన్లోని భద్రతా బలగాలకు కేంద్రం నుంచి పిలుపొచ్చింది. సరిహద్దుకు రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో భద్రతా బలగాలు దశలవారీగా కర్రెగుట్ట అడవులను వీడుతున్నాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు హెడ్క్వార్టర్స్కు చేరుకోవాలన్న ఆదేశాలూ వచ్చాయి. ఆదివారం ఉదయం లోపు ప్రతిఒక్కరూ సరిహద్దుల్లోకి వెళ్లనున్నట్లు ఆదేశాలు పేర్కొన్నాయి.
యథావిధిగా కగార్..
అయితే దళాలు వెనక్కి వెళ్తున్నంత మాత్రాన ఆపరేషన్ కగార్ ఆగదని అధికారులు చెప్పారు. కేంద్రం ఆదేశించి బలగాలు సరిహద్దు బాట పట్టగా మిగిలిన బలగాలతో కర్రెగుట్టలో ‘కగార్’ను కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. మావోలను ఏరిపారేసేవరకు ఈ ఆపరేషన్ ఆగదని, ఆపమని అధికారులు పేర్కొన్నారు.
సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మూడు రోజులు హైటెన్షన్ నెలకొని ఉంది. పాకిస్థాన్ వరుస దాడులు చేస్తోంది. వాటిని భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నాయి. కాగా ఈ పరిస్థితులు ఇంకెంత దూరం వెళతాయో తెలియని పరిస్థితుల్లో.. ప్రతి ఒక్క సైనికుడిని సరిహద్దుకు చేర్చాలని త్రివిధ దళాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరుకు ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చి.. బలగాలను సరిహద్దుకు తరలిస్తున్నాయి.