
ఆపరేషన్ కగార్ తో కేంద్రం లైన్ క్లియర్ అయిపోయిందా ?
మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపే విషయంలో తనకు ఎలాంటి ఆసక్తిలేదని కేంద్రప్రభుత్వం చెప్పకనే చెప్పేసింది.
తాజాగా నాలుగోరోజు కంటిన్యు అవుతున్న ‘ఆపరేషన్ కగార్’ తో కేంద్రప్రభుత్వం ఉద్దేశ్యం తేలిపోయింది. మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపే విషయంలో తనకు ఎలాంటి ఆసక్తిలేదని కేంద్రప్రభుత్వం చెప్పకనే చెప్పేసింది. ఛత్తీస్ ఘడ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల అడవులను భద్రతాదళాలు నాలుగురోజుల క్రితం చుట్టుముట్టాయి. అప్పటినుండి అడవులను అణువణువును జల్లెడపడుతున్నాయి. ఎదురుపడిన మావోయిస్టులను ఎదురుపడినట్లే కాల్చి చంపేస్తున్నాయి భద్రతాదళాలు. ఇప్పటికి సుమారు ఎనిమిదిమంది మావోయిస్టులు కాల్పుల్లో చనిపోయినట్లు సమాచారం. కాల్పులను, అడవులను జల్లెడపట్టడాన్ని, మావోయిస్టుల మృతిని భద్రతాదళాలు అధికారికంగా ధృవీకరించటంలేదు. అయితే కర్రెగుట్టల అడవులను వేలాదిమంది భద్రతాదళాలు చుట్టుముట్టడం మాత్రం వాస్తవం. ఎలాగంటే అడవుల్లో భద్రతాదళాల కదలికలు కనబడుతున్నాయి, తుపాకుల గర్జనలు నాలుగురోజులుగా వినిపిస్తునే ఉన్నాయి. చూసిన దాన్ని, జరుగుతున్నదాన్ని బట్టి ఎవరికివారుగా అంచనాలు వేసుకోవాల్సిందే కాని అధికారికంగా ఎవరూ ఏ విషయాన్నీ చెప్పటంలేదు.
భద్రతాదళాల గాలింపులు, ఎన్ కౌంటర్లను మావోయిస్టులు తట్టుకోలేకపోతున్న విషయం వాస్తవం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, తెలంగాణ, ఏవోబీ ప్రాంతాల్లో చాలాకాలంగా భద్రతాదళాలు మావోయిస్టులకోసం అలుపెరుగకుండా వేటాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దేశాన్ని మావోయిస్టు రహిత భారత్ గా మార్చేందుకు 2026, మార్చినెలను డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. అమిత్ షా ప్రకటనకు అనుగుణంగానే కోబ్రా, సీఆర్ఫీఎఫ్, మిలిట్రీ, గ్రే హౌండ్స్, పోలీసులు, యాంటీ నక్సల్ స్వ్కాడ్ నుండి మెరికల్లాంటి సిబ్బంది, అధికారులను తీసుకుని ప్రత్యేకంగా ఆపరేషన్ కగార్ అనే కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ కగార్ లక్ష్యం ఏమిటంటే దేశంలో మావోయిస్టులు ఏమూలున్నా ఏరిపారేయటమే.
తమ లక్ష్యానికి అనుగుణంగానే భద్రతాదళాలు 24 గంటలూ పనిచేస్తు అడవులను జల్లెడపడుతు మావోయిస్టులను వెంటాడి, వేటాడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే గడచిన నాలుగునెలల్లో వందలాది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోగా మరికొన్ని వందలమంది గాయాలపాలయ్యారు. ఇదేసమయంలో సుమారు 400 మంది దాకా మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ లో తప్పించుకోలేక ప్రాణభయంతో చాలామంది మావోయిస్టులు పోలీసులముందు లొంగిపోతున్నారు. ఇపుడు కర్రెగుట్టలఅడవులను భద్రతాదళాలు చుట్టుముట్టడానికి కారణం అడవుల్లో మావోయిస్టులు పెద్దసంఖ్యలో క్యాంపు వేసున్నారన్న సమాచారమే. విశ్వసనీయమైన సమాచారంతోనే భద్రతాదళాలు అడవులను చుట్టుముట్టి కూంబింగ్ ఆపరేషన్ జోరుగా చేస్తోంది.
ఆపరేషన్ కగార్ ను తప్పించుకోలేకే మావోయిస్టుల అధికారప్రతినిధి రూపేష్ శాంతిచర్చలకు పదేపదే పిలుపిస్తున్నారు. అయితే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మాత్రం స్పందించలేదు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మొదట్లో శాంతిచర్చలకు అనుకూలమని ప్రకటించినా తర్వాత ఏమీ మాట్లాడలేదు. కేంద్రప్రభుత్వం ఆలోచనకు తగ్గట్లే బహుశా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా స్టాండ్ మార్చుకున్నట్లే అనుమానంగా ఉంది. శాంతిచర్చల పేరుతో పుంజుకునేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నుతున్నట్లు కేంద్రప్రభుత్వం అనుమానించినట్లుంది. అందుకనే శాంతిచర్చల విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుండి స్పందన కనబడలేదు సరికదా ఆపరేషన్ కగార్ ను మరింత జోరుగా చేస్తోంది. అందుకనే మావోయిస్టులకు డేంజర్ సిగ్నల్స్ తప్పేట్లులేదు.