
ఫిరాయింపులకు ఎక్కువ సమయం లేదు: జగదీష్
స్పీకర్ వివక్ష చూపుతున్నారు.
ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఫిరాయింపులకు చాలా సమయం ఇచ్చిన స్పీకర్.. వారి సమాధానాలపై స్పందించడానికి తమకు మాత్రం మూడు రోజులే సమయం ఇవ్వడం దారుణమన్నారు. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లు తమ దగ్గర ఉన్న ఆధారాలను అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఉపేందర్కు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ సందర్భంగానే ఫిరాయింపులపై జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘మేము సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో మూడు నెలల్లో నిర్ణయం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. స్పీకర్ పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు మేము అమాయకులం,కేసీఆర్ పైన నమ్మకం ఉందని స్పీకర్ కు వివరణ ఇచ్చారు. దీనిపై మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని పంపిస్తూ మూడు రోజుల్లో మమ్మల్ని సమాధానం ఇవ్వాలని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కువ రోజులు సమయం ఇచ్చిన స్పీకర్ మాకు మాత్రం మూడు రోజులే సమయం ఇచ్చారు. స్పీకర్ గడువు ఇచ్చిన మూడు రోజుల్లోనే మేము సమాధానం ఇచ్చాము’’ అని తెలిపారు.
‘‘మేము పార్టీ మారలేదు,సీఎం దగ్గరకు వెళ్తే మా మెడలో మూడు రంగుల కండువా కప్పారు అని ఎమ్మెల్యేలు చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అమాయాకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభలు,సమావేశాల్లో పదిమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం మాటలను ఏ.ఐ ద్వారా ఏమైనా మార్ఫింగ్ చేశారా? నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అంటే సీఎం మా ఇంటికి వచ్చారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ పై నమ్మకం ఉంటే కేసీఆర్ ఫోటో, కేసీఆర్ కండువా ఉండాలి కదా?’’ అని ప్రశ్నించారు.
‘‘అభివృద్ధి కోసం సీఎంను కలిసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ, మహేష్ కుమార్ గౌడ్ ను ఎందుకు కలిశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తే సడెన్ గా సీఎం కండువా కప్పారని చెప్పారు. సంజయ్ పేపర్ ప్రకటనల్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉన్నారు. గాంధీ భవన్,కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ లో పాల్గొంటే అభివృద్ధి ఎట్లా అవుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మేము తప్పుచేసి పార్టీ మారామని నియోజకవర్గ ప్రజల ముందు ఒప్పుకోవాలి. మేము పార్టీ మారలేదని కేసీఆర్ దగ్గర పిటీషన్ పెట్టుకోండి. నోటీసులు వచ్చాక కేసీఆర్ దగ్గరకు రావాల్సిన పదిమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారు?’’ అని నిలదీశారు.
‘‘ఎన్ని చేసినా పదిమంది ఎమ్మెల్యేలు తప్పించుకోలేరు. పదిమంది ఎమ్మెల్యేలు దొరికిపోయిన దొంగలు. సీఎం రేవంత్ రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నారు. మేము తప్పించుకోలేమా అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పదిమంది ఎమ్మెల్యేలు ఇక్కడ తప్పించుకున్నా కోర్టుముందు తప్పించుకోలేరు. ఉప ఎన్నికలు రావడం ఖాయం మీకు రాజకీయ భవిష్యత్ లేకుండా ప్రజలు చేయడం ఖాయం. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విదేశాల్లో ఉండటంతో వచ్చిన తర్వాత స్పీకర్ కు ఆధారాలు సమర్పిస్తారు. కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి’’ అని కోరారు.
‘‘కోర్టు గడువు ఉన్నందున ఎక్కువ రోజులు సమయం లేదు. మూడు రోజుల్లో చెప్పాలని స్పీకర్ మమ్మల్ని కోరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫోటోలను మీడియా మార్ఫింగ్ చేసిందా...? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారారు అని మీడియాలో వచ్చింది కదా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసినా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. పదిమంది ఎమ్మెల్యేలపై చర్యలు త్వరగా తీసుకోవాలని మేము కోరుతున్నాము. వాళ్ళు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు ద్రోహం చేశారు అని మేము పిటీషన్ ఇచ్చాము. పదిమంది ఎమ్మెల్యేలు గడ్డిపోచను పట్టుకుని వరద నుంచి బయటపడాలని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.