ఉత్తమ సేవలందించిన టీ పోలీసులకు డీజీపీ ప్రశంసా పత్రాలు
x

ఉత్తమ సేవలందించిన టీ పోలీసులకు డీజీపీ ప్రశంసా పత్రాలు

తెలంగాణలో ప్రజలకు ఉత్తమ సేవలందించిన పోలీసులకు డీజీపీ జితేందర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఉత్తమ పోలీసులను ఎంపిక చేశారు.


తెలంగాణలో ప్రజలకు ఉత్తమ సేవలందించి ఫ్రెండ్లీ పోలీసులుగా నిలచిన పోలీసు అధికారులకు తెలంగాణ డీజీపీ బుధవారం ప్రశంసా పత్రాలను అందజేశారు. పౌరుల అభిప్రాయాల ఆధారంగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని డీజీపీ జితేందర్ అభినందించారు.


ఎలా ఎంపిక చేశారంటే...
సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ నుంచి వచ్చిన పౌరుల అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ ఉత్తమ పోలీసులను ఎంపిక చేశారు.రాష్ట్రంలోని 2,116 మంది పౌరుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా టాప్ 10 పోలీస్ స్టేషన్‌లు/ఎస్ హెచ్ ఓలు, టాప్ 5 రిసెప్షన్ ఆఫీసర్లు, టాప్ 5 ఎంక్వైరీ ఆఫీసర్‌లకు ఈ గుర్తింపు లభించింది.

సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్
తెలంగాణ సీఐడి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ పోలీసుల సామర్థ్యం, జవాబుదారీతనం మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించింది. ఆటోమేటెడ్ కాలింగ్ యాప్ ద్వారా పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వెరీ ఫాస్ట్ పాస్‌పోర్ట్ డేటా, ఇ-చలాన్ డేటా, ఎఫ్‌ఐఆర్ డేటా వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి, పోలీసు సేవలు పొందిన పౌరుల నుంచి ప్రత్యేక బృందం అభిప్రాయాలను సేకరించింది. పౌరులను అవుట్‌బౌండ్ కాల్‌ల ద్వారా సంప్రదించారు. పోలీసు అధికారుల ప్రతిస్పందన, ప్రవర్తనపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పోలీసు అధికారులు రేట్ చేసి ర్యాంక్ చేశారు.

కొత్త సాంకేతికను త్వరలో ప్రవేశపెడతాం
తెలంగాణ పోలీసుశాఖలో క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌లతో సహా కొత్త సాంకేతికను త్వరలో ప్రవేశపెడతామని డీజీపీ జితేందర్ ప్రకటించారు.ఈ వ్యవస్థ ద్వారా పిటిషనర్లు, బాధితులు సులభంగా అభిప్రాయాన్ని అందించవచ్చన్నారు.ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ ద్వారా పోలీసులు నిరంతరం తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు డీజీపీ (శాంతి భద్రతలు)మహేశ్‌ ఎం.భగవత్‌,శ్రీనివాస్‌, ఎస్పీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సీఐడి డీఎస్పీ సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story