కెసిఆర్-జగన్ గోదావరి డీల్ ని చంద్రబాబు అమలుచేస్తున్నారా?
x
KCR and Jagan at Pragati Bhavan meeting held on 2019, June 28, Friday

కెసిఆర్-జగన్ గోదావరి డీల్ ని చంద్రబాబు అమలుచేస్తున్నారా?

చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజాలు పడ్డాయని రేవంత్ బల్లగుద్ది చెప్పడానికి కారణాలున్నాయా?


స్ధలం : హైదరాబాద్, ప్రగతిభవన్

తేదీ : 2019, జూన్ 28, శుక్రవారం

సమావేశం: కేసీఆర్-జగన్మోహన్ రెడ్డి మధ్య

విషయం : గోదావరి నదీ జలాలను మళ్ళించటం

పై నాలుగు పాయింట్లను చదివగానే ఎవరికైనా విషయం అర్ధమైపోతుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఇపుడు ఏపీ ప్రభుత్వం అంకురార్పణ చేయటానికి కారణం అప్పట్లో కేసీఆర్(KCR) ఏపీకి ఇచ్చిన హామీనే అని చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), ఏపీ ఇరిగేషన్ శాఖమంత్రి నిమ్మ రామానాయుడు పదేపదే చెబుతున్నారు. ఇదే మాటను రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ధృవీకరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం టేకప్ చేయబోతున్న బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే అంకురార్పణ జరిగిందని రేవంత్ బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.

2016, ఢిల్లీలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా గోదావరి(Godavari waters) జలాలను ఏపీలో వాడుకోవటానికి అభ్యంతరంలేదని కేసీఆర్ అంగీకరించారని రామానాయుడు చెప్పారు. రామానాయుడు చెప్పింది నిజమే అని రేవంత్(Revanth), ఉత్తమ్(Uttamkumar Reddy) కూడా అంటున్నారు. అయితే అపెక్స్ కౌన్సిల్ మీటింగులో కేసీఆర్ అలా చెప్పలేదని అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావు(Harish Rao) ఖండిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అపెక్స్ మీటింగ్ ఆధారంగా తెలంగాణ-ఏపీలో మూడుముక్కలాట జరుగుతోంది. ఎపెక్స్ మీటింగ్ లో కేసీఆర్ అంగీకారించారని ఏపీ మంత్రి నిమ్మల, రేవంత్, ఉత్తమ్ పదేపదే చెబుతుంటే హరీష్ తూచ్ కాదుపొమ్మంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంత వివాదం జరుగుతున్ననా అపెక్స్ మీటింగు మినిట్స్ ను ఏపీ ప్రభుత్వం బయటపెట్టడంలేదు. సమావేశాన్ని నిర్వహించిన జలవనరుల శాఖ కూడా అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ గురించి నోరు విప్పటంలేదు.

అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ బయటకు వస్తాయో రావో చెప్పలేం. అయితే, గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు కెసిఆర్, జగన్ మోహన్ రెడి(YS Jaganmohan Reddy)ల మధ్య ఒక అవగాహనకుదిరిందనేందుకు ఒక చిన్న సాక్ష్యం ఉంది.అదే కెసిఆర్ జగన్ ల మధ్య జరిగిన 2019 సమావేశం.

2019లో హైదరాబాద్ కేంద్రంగా ప్రగతిభవన్లో కేసీఆర్-జగన్ సమావేశంలో జరిగిన నిర్ణయం ఇపుడు వైరల్ గా మారింది. ఈ ఇద్దరి సమావేశంలో గోదావరి, కృష్ణాలోని 4 వేల టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాల్లోని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవాలనే నిర్ణయం జరిగింది. రెండు రాష్ట్రాలమధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న జలవివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకాలని ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పట్లో నిర్ణయించారు. రెండు నదుల్లో లభ్యమవుతున్న నీటిని ఎంతవీలైతే అంతా ఉపయోగించుకోవాలని సమావేశం నిర్ణయించింది. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ కు మళ్ళించి అక్కడినుండి ఏపీలోని రాయలసీమజిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్(పాలమూరు), ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. జలాల మళ్ళింపుకు వీలుగా ఒక రూట్ మ్యాప్ ను తయారుచేయాలని కూడా ముఖ్యమంత్రులు సంబంధిత ఉన్నతాధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు.

మీటింగులో కేసీఆర్ మాట్లాడుతు రెండు రాష్ట్రాలుగనుక పూర్తిస్ధాయిలో అందుబాటులో ఉన్న నదీజలాలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంలో తమకు ఇగోలు, భేషజాలు లేవన్నారు. వివాదాలను ఇలాగే కొనసాగిస్తుంటే భవిష్యత్ తరాలకు అవసరమైన నీటిని అందించే అవకాశాలు తగ్గిపోతాయని కూడా చెప్పారు. కృష్ణానదిలో నీటిలభ్యంత తగ్గిపోతున్న కారణంగా గోదావరి జలాలను ఎంత అవకాశం ఉంటే అంతా వినియోగించుకోవాలని నిర్ణయించామని కేసీఆర్ ప్రకటించారు. ఇదే సమావేశంలో జగన్ మాట్లాడుతు గోదావరి జలాల మళ్ళింపుపై ఉన్నతాధికారులు, ఇరిగేషన్ నిపుణులు నివేదికలు అందిస్తారని చెప్పారు.

సమావేశంలోనే గోదావరి, కృష్ణ నదుల్లో అందుబాటులో ఉన్న జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. గోదావరి, కృష్ణా నదులకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలు ప్రాజెక్టులు నిర్మించేయటం వల్ల దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీకి ఎదురవుతున్న ఇబ్బందులను కేసీఆర్ వివరించారు.

Read More
Next Story