
హైదరాబాదులో ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళున్నారో తెలుసా ?
హైదరాబాదు(Hyderabad)లో ఎంతమంది పాకిస్తానీయులు ఉంటున్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరించి లెక్కలు కట్టటంలో బిజీ అయిపోయారు
శ్రీనగర్ లోని పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పుల తర్వాత దేశమంతా హై అలర్టు అయిపోయింది. ముందుజాగ్రత్తగా దేశంలోని పాకిస్తానీయులంతా తక్షణమే దేశాన్ని విడిచివెళ్ళిపోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) విజ్ఞప్తిచేశారు. శుక్రవారం ఉదయం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఇదేవిషయాన్ని ఫోన్లో మాట్లాడారు. ముందు ఆయా రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయుల(Pakistan Nationals) వివరాలను సేకరించి పంపించాలని చెప్పారు. అన్నీ రాష్ట్రాల నుండి వివరాలు అందితే కాని ఎంతమంది పాకిస్తానీయులు దేశంలో ఉంటున్నారనే విషయంలో కచ్చితమైన లెక్క తేలదనిచెప్పారు. మెడికల్ వీసాలు పొందిన వారు మాత్రం దేశాన్ని విడిచిపెట్టేందుకు ఏప్రిల్ 29ని గడువుగా ప్రకటించారు. మిగిలిన వాళ్ళంతా వెంటనే వెళ్ళిపోవాలని అమిత్ షా ఆదేశించారు.
ఈనేపధ్యంలోనే హైదరాబాదు(Hyderabad)లో ఎంతమంది పాకిస్తానీయులు ఉంటున్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరించి లెక్కలు కట్టటంలో బిజీ అయిపోయారు. వివిధ కారణాలతో ఇండియాకు వచ్చేవాళ్ళు కచ్చితంగా తమ వివరాలను నమోదుచేసుకోవాలి. వీసా వివరాలతో పాటు ఎక్కడ ఉంటున్నారు ? ఎవరితో ఉంటున్నారు ? ఫోన్ నెంబర్లు, తమకు ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు, ఫోన్ నెంబర్లన్నింటినీ పోలీసుల దగ్గర రిజిస్టర్ చేయాలి. ఇందుకోసం శంషాబాద్ లోని మామిడిపల్లిలో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉంది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం పాతబస్తీలోని పురానా హవేలీలోని స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలో ఉండే పాక్, బంగ్లాదేశ్ బ్రాంచీల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
స్పెషల్ బ్రాంచ్ లెక్కల ప్రకారం హైదరాబాదులో రిజిస్టర్ అయ్యున్న పాకిస్తానీయుల సంఖ్య 208. వీరిలో లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారు 156 మంది. హైదరాబాద్ వారిని వివాహం చేసుకున్న పాకిస్తానీయులతో పాటు వారి రక్త సంబంధీకులకు లాంగ్ టర్మ్ వీసాలను జారీచేస్తారు. వీళ్ళుకాకుండా మరో 13మంది షార్ట్ టర్మ్ వీసాలను కలిగున్నారు. పర్యాటకులుగా ఇండియాకు వచ్చేవారికి, బిజినెస్ పనుల మీద వచ్చేవారికి షార్ట్ టర్మ్ వీసాలను మంజూరుచేస్తారు. పై రెండు కేటగిరీలు కాకుండా మిగిలిన 39 మంది మెడికల్ వీసామీద హైదరాబాదులో ఉన్నారు. ఇవన్నీ హైదరాబాదులో అధికారికంగా ఉంటున్న పాకిస్తానీయుల సంఖ్య మాత్రమే. హైదరాబాదుతో పాటు తెలంగాణ మొత్తంమీద ఎంతమంది పాకిస్ధానీయులు ఉంటున్నారనే వివరాలు సేకరిస్తున్నారు.
అలాగే అనధికారికంగా ఎంతమంది పాకిస్తానీయులు హైదరాబాదుతో పాటు మిగిలిన రాష్ట్రంలో ఉంటున్నారనే వివరాలు ప్రభుత్వం దగ్గరలేవు. నిజానికి అనధికారికంగా ఉంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఉగ్రకార్యకలాపాలు జరిగినా దాని మూలాలు చాలాసార్లు హైదరాబాదులోనే కనిపించేవి. అందుకనే దేశంలో ఎక్కడ టెర్రరిస్టులు(Terrorists) ఏమిచేసినా వెంటనే కేంద్రదళాలు, దర్యాప్తుసంస్ధలు హైదరాబాదులో హై అలెర్ట్ ప్రకటిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో మారణహోమాలు సృష్టించిన టెర్రరిస్టులు తర్వాత కాలంలో హైదరాబాద్ లో పట్టుబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. పోలీసులు ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ విభాగం అంచనా ప్రకారం టెర్రరిస్టులకు, టెర్రరిస్టు సానుభూతిపరులకు ఓల్డ్ సిటి షెల్టర్ జోన్ అయిపోయింది. నిజానికి ముస్లింలందరికీ టెర్రరిజంతో సంబంధాలుండవు. టెర్రరిజంతో సంబంధాలుండే ముస్లింలు, టెర్రరిస్టులకు సానుభూతిపరులుగా ఉండే ముస్లింల సంఖ్య చాలా చాలా తక్కువనే చెప్పాలి.
పాకిస్ధాన్ నుండి వచ్చేటపుడు ఏదో రాష్ట్రంలోకి ప్రవేశించి తర్వాత హైదరాబాదులో తేలుతున్న వారిసంఖ్యా తక్కువేమీకాదు. కాబట్టి అనధికారికంగా ఓల్డ్ సిటీలో పాకిస్తానీయులు ఎంతమంది ఉంటున్నారన్న విషయంలో లెక్కలు దొరికే అవకాశాలు తక్కువ. ఏదేమైనా అమిత్ షా తాజా ఆదేశాలతో(Telangana) తెలంగాణ+హైదరాబాద్ లో ఉండే పాకిస్తానీయుల వివరాల సేకరణ మొదలైంది. ఏమి తేలుతుందో చూడాలి.
పాక్ పౌరులకు డీజీపీ జితేందర్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు డీజీపీ జితేందర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారికి ఈ నెల 30 వరకు టైమ్ ఇస్తున్నామని, ఆ లోపు వాఘా సరిహద్దు దాటాలని అన్నారు. ‘‘పాకిస్థాన్ పౌరుల వీసాలను కేంద్రం నిలిపివేసింది. ఇప్పటికే వీసాలు పొందిన వారికి ఈ నెల 27 వరకు టైమ్ ఉంది. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి ఈ నెల 29 వరకు అనుమతి ఉంది. ఈ నెల 30 వరకు మాత్రమే వాఘా సరిహద్దు తెరిచి ఉంటుంది. ఆ లోపే బోర్డర్ దాటేయాలి. కాదు కూడదు ఉంటాం, దాక్కుంటాం అంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు.