రేవంత్ ఫోన్ను ఎలా ట్యాప్ చేశారో తెలుసా ?
x
Revanth reddy

రేవంత్ ఫోన్ను ఎలా ట్యాప్ చేశారో తెలుసా ?

అప్పట్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేరి తర్వాత ప్రెసిడెంట్ అయిన రేవంత్ మంచి ఊపుమీదున్నాడు


బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏ1 నిందితుడు టీ ప్రభాకరరావు బీఆర్ఎస్ ప్రత్యర్ధులతో పాటు అనుమానం ఉన్న వారందరి ఫోన్లను ట్యాప్(Telephone Tapping) చేయించారు. ఇప్పటికి బయటపడిన సమాచారం ప్రకారం 4200 మొబైల్ ఫోన్లను ప్రభాకరరావు బృందం ట్యాపింగ్ చేసింది. ట్యాపింగు బాధితుల్లో బీఆర్ఎస్(BRS) ప్రత్యర్ధులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, హక్కులసంఘాల నేతలు, జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులతో పాటు చివరకు బీఆర్ఎస్ లోనే ఉన్న అనుమానిత నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు.

ట్యాపింగ్ బాదిత ముఖ్యుల్లో ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth reddy) ముందువరసలో ఉన్నాడు. అప్పట్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేరి తర్వాత ప్రెసిడెంట్ అయిన రేవంత్ మంచి ఊపుమీదున్నాడు. టీడీపీ(TDP)లో నుండి రేవంత్ కాంగ్రెస్(Telangana Congress) లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేరగానే పార్టీకి ఒక్కసారిగా ఊపొచ్చింది. రేవంత్ చేరకముందు కాంగ్రెస్ పార్టీ చాలా స్తబ్దుగా ఉండేది. చాలామంది నేతలు, క్యాడర్లో అధికారంలోకి వచ్చే విషయమై ఎలాంటి నమ్మకాలు లేవు. అలాంటి పరిస్ధితిలో రేవంత్ చేరగానే తనతో పాటు టీడీపీకి చెందిన కొందరు ఎంఎల్ఏలు, సీనియర్ నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఊపుమొదలైపోయింది. అప్పటికే కేసీఆర్ తో బద్ధవిరోధమున్న రేవంత్ కూడా రెచ్చిపోయాడు.

ఇంకేముంది వెంటనే రేవంత్ తో పాటు తన కుటుంబసభ్యులు, తనకు సన్నిహితంగా ఉండే నేతల ఫోన్ల ట్యాపింగ్ మొదలైపోయింది. ప్రత్యేకంగా రేవంత్ ఫోన్ను ట్యాప్ చేయటానికి టీ ప్రభాకరరావు ‘ఆర్ఆర్ మాడ్యూల్’ అనే కోడ్ ఏర్పాటుచేశారు. ఆర్ఆర్ మాడ్యూల్ లోకి రేవంత్ తో పాటు కుటుంబసభ్యులు, కొందరు సన్నిహిత నేతల ఫోన్లను చేర్చారు. 24 గంటలూ ఈనెంబర్లను పర్యవేక్షించటానికి డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పాటయ్యింది. 20 మంది సభ్యులున్న ఈ బృందం 24 గంటలు షిఫ్టు సిస్టమ్ లో పనిచేసింది. మాడ్యూల్ లో ఉన్న నెంబర్లకు వచ్చే ఫోన్లు, నెంబర్ల నుండి వెళ్ళే ఫోన్లు, చివరకు ఫోన్లకు వచ్చిన వాట్సప్ చాటింగ్, ఎస్ఎంఎస్ లను కూడా ప్రత్యేక బృందం పర్యవేక్షించింది.

రేవంత్ మీద ఇంత ప్రత్యేకంగా నిఘా ఎందుకంటే జనాల్లోకి దూసుకుపోతున్నాడు కాబట్టే. రేవంత్ చేరిన తర్వాత కాంగ్రెస్ నేతలు, క్యాడర్లో ఒక్కసారిగా ఊపొచ్చిందని, గ్రాఫ్ పెరుగుతోందనే రిపోర్టులు కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నిఘా బృందాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల నుండి కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అధ్యక్షుడు అయిన తర్వాత నేతలు, క్యాడర్లో ఊపుమరింతగా పెరిగిపోయింది. కొంతమంది సీనియర్ నేతలకు టికెట్లు హామీ ఇచ్చి మరీ ఇతర పార్టీల నుండి రేవంత్ చేర్చుకుంటున్నాడు.

రేవంత్ నుండి టికెట్ హామీ పొందిన నేతలు ఎవరు ? ఏ నేతలు పార్టీ మారిపోతున్నారు ? అనే విషయాలు తెలుసుకునేందుకే 24 గంటలూ ఫోన్లపై నిఘాపెట్టారు. 24గంటల నిఘకోసం ప్రత్యేకంగా ట్యాపింగ్ సాంకేతిక పరికరాలు, సాఫ్ట్ వేర్లు కొనుగోలు చేసి తెప్పించారు. ట్యాపింగ్ పరికరాలు, సాఫ్ట్ వేర్లు, ఎంసీ క్యాచర్లను ఒక వాహనంలో పెట్టుకుని రేవంత్ ఇంటికి సమీపంలోనే ఏర్పాటుచేశారు. ఎందుకైన మంచిదని రేవంత్ ఇంటికి సమీపంలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ కూడా పరికరాలను ఏర్పాటుచేసి ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు. మొత్తానికి ఆర్ఆర్ మాడ్యూల్ ద్వారా రేవంత్ మొబైల్ ఫోన్లు ట్యాప్ అయినట్లు తాజా విచారణలో బయటపడింది.

Read More
Next Story