హైదరాబాద్ నగరంలో చదరపు గజం ధర ఎంతో తెలుసా?
x

హైదరాబాద్ నగరంలో చదరపు గజం ధర ఎంతో తెలుసా?

గ్లోబల్ సిటీగా ఎదిగిన హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశన్నంటాయి. తెలంగాణ హౌసింగ్ చదరపు గజం ధర రూ.2.98 లక్షలు పలికింది.


తెలంగాణ హౌసింగ్ బోర్డు బుధవారం వేలం ద్వారా విక్రయించిన భూమి చదరపు గజం ధర రూ.2.98 లక్షలు పలికింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రికార్డు స్థాయిలో భూముల ధరలు పలికాయి.తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ కూకట్ పల్లి లో 18 స్థలాలకు వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు రూ.142 కోట్ల భారీ ఆదాయం వచ్చింది.


భూముల ధరలకు పెరిగిన డిమాండ్

హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ ప్లాట్ల వేలం భూముల ధరల డిమాండ్ వెలుగుచూసింది. ఖాళీ ప్లాట్ల విక్రయం కోసం బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం రూ.2.98 లక్షలకు కొనుగోలు చేశారు. చదరపు గజం ధర ఇంత భారీగా పలకడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం అని హౌసింగ్ బోర్డు అధికారులు హర్షం వ్యకం చేశారు.హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని విఖ్యాత డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాటూరి సురేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



పుంజుకున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచి పురోభివృద్ధిలో ఉందన్న దానికి భూముల ధరలే నిదర్శమని హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 7 లో ని ఖాళీగా ఉన్న18 స్థలాలకు స్థానిక కమ్యూనిటీ హాల్ లో బుధవారం నాడు బహిరంగ వేలం నిర్వహించారు. 198 గజాల నుంచి 987 గజాల వరకు విస్తీర్ణం ఉన్నప్లాట్ల విక్రయం కోసం నిర్వహించిన వేలం పాటలో 22 వ నెంబరు ప్లాట్ కు బిడ్డర్లు చదరపు గజానికి రూ.2.98 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు.ఈ ఫ్లాట్ల వేలంలో మొత్తం 84 మంది పాల్గొన్నారు.

హౌసింగ్ బోర్డుకు భారీ ఆదాయం
ఈ వేలం పాట ద్వారా హౌజింగ్ బోర్డుకు రూ.142.78 కోట్ల మేర ఆదాయం వస్తుందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఈ 18 ప్లాట్లకు సంబంధించి మొత్తం 6,232 చదరపు గజాలను వేలం వేయగా సగటున ఒక్కో గజానికి రూ.2.38 లక్షలు పలికింది. 22 ప్లాట్ కు సంబంధించి మాత్రం అత్యధికంగా రూ.2.98 లక్షల ధర పలకడం రికార్డు. ఈ వేలం పాటలో భూములు కొనుగోలు చేసిన వారు రెండు రోజుల్లో నాలుగోవంతు సొమ్మును చెల్లించాల్సి ఉంది. ఈ రూపేణా హౌసింగ్ బోర్డుకు రూ.35.34 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది.



Read More
Next Story