
ఏపీతో కేసీఆర్ కుమ్మకైనట్లు హరీష్ అంగీకరిస్తున్నారా ?
వందరూపాయలు కూడా ఖరీదుచేయని బజ్జీల కోసం ముఖ్యమంత్రి పదవితో పాటు తన రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెట్టేస్తాడా రేవంత్ ?
మాజీమంత్రి, బీఆర్ఎస్ లో కీలకనేత తన్నీరు హరీష్ రావు తెలివైన నేతే అనటంలో సందేహంలేదు. అయితే ఒక్కోసారి ఆవేశంలో నోరుజారేస్తారు. అప్పుడు కాంగ్రెస్ నేతలకు అడ్డంగా దొరికిపోతారు. ఇపుడు విషయం ఏమిటంటే శనివారం మీడియాతో హరీష్(Harish) మాట్లాడుతు ‘సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి..బనకచర్ల ప్రాజెక్టపై ఏపీతో కుమ్మక్కయ్యార’ని మండిపడ్డారు. బజ్జీలు తినొస్తే తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ ఏపీకి తాకట్టు పెట్టొచ్చేసినట్లేనా ? వందరూపాయలు కూడా ఖరీదుచేయని బజ్జీల కోసం ముఖ్యమంత్రి పదవితో పాటు తన రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెట్టేస్తాడా రేవంత్ ? హేమిటో హరీష్ ఒక్కోసారి నోటికొచ్చినట్లు సిల్లీగా మాట్లాడేస్తాడు. రోజా(RK Roja) ఇంట్లో భోజనంచేసిన కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టేశాడన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతల పిచ్చి ఆరోపణలకు హరీష్ కౌంటర్ గా రేవంత్..బజ్జీలు, బనకచర్లంటు ఏవేవో మాట్లడేశారు.
ఒకవేళ హరీష్ చెప్పింది నిజమే అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలు కూడా నిజమే అయ్యుండాలి. కాంగ్రెస్ నేతల ఆరోపణల ప్రకారం తన మేనమామ కేసీఆర్(KCR) తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారని అంగీకరిస్తున్నట్లేనా ? 2019లో కుటుంబసమేతంగా కేసీఆర్ పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా కంచికి కూడా వెళ్ళారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్ కంచి(Kanchi Temple)కి వెళ్ళేటపుడు మధ్యలో నగిరిలో రోజా ఇంట్లో ఆగారు. మధ్యాహ్నం రోజా ఇంట్లోనే భోజనంచేశారు. భోజనంలో రాగిసంకటి, రొయ్యలపులుసు, చికెన్ తో పాటు అనేక వంటకాలు రుచిచూశారు. తర్వాత కంచికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు.
ఇక్కడ విషయం ఏమిటంటే రోజా ఇంట్లో కేసీఆర్ భోజనం చేసినా, చంద్రబాబు(Chandrababu)తో కలిసి రేవంత్(Revanth) బజ్జీలు తిన్నా తెలంగాణకు లాభమూ లేదు నష్టమూ లేదు. ఎందుకంటే భోజనం చేసో లేకపోతే బజ్జీలు తినేసో రాష్ట్రప్రయోజనాలపై ఎవరూ రాజీపడిపోరు. అందరు నూరుశాతం రాజకీయనేతలే కాబట్టి ‘తమ్ముడు తమ్ముడే..పేకేట పేకాటే’ అనే రకాలు. కేసీఆర్ అధికారంలో ఉన్నపుడే కర్నూలులో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఊపందుకున్నది వాస్తవం. రాయలసీమ ప్రాజెక్టు విస్తరణను వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) ప్రిస్టేజిగా తీసుకున్నారు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు అంటే టీడీపీ ప్రభుత్వం కాదు. బీజేపీ+జనసేన+టీడీపీ కలిసిన ఎన్డీయే ప్రభుత్వమని అర్ధం. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారంటే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే అనుకోవాలి.
కాబట్టి బనకచర్ల నిర్మాణం విషయంలో రేవంత్ ప్రభుత్వంమీద హరీష్ ఎన్ని ఆరోపణలు చేసినా ఉపయోగం ఉండదు. టార్గెట్ చేయాల్సింది తెలంగాణ బీజేపీని మాత్రమే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగాను కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నది బీజేపీనే కాబట్టి. పైగా సముద్రంలో కలిసి వృధా అవుతున్న 3 వేల టీఎంసీల నీటిని వాడుకుంటే నష్టమేమిటి ? అని చంద్రబాబు లాజిక్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు లాజిక్కులో నిజమెంత ? అబద్ధమెంత ? అన్న విషయమై హరీష్ పాయింట్ బై పాయింట్ మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా బజ్జీలు తిన్న హరీష్ చంద్రబాబు విషయంలో స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారని అంటే, రాగిసంకటి, రొయ్యలపులుసు తిన్న కేసీఆర్ ఏపీతో కుమ్మక్కయినట్లు అంగీకరిస్తున్నట్లే అనుకోవాలి.