రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..
x

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఎలక్షన్ కమిషన్ అనుమతిచ్చింది. జూన్ 2 న ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఎలక్షన్ కమిషన్ అనుమతిచ్చింది. జూన్ 2 న ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే రోజున అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ నివాళులు అర్పించనున్నారు. వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎస్ శాంతి కుమారి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. జూన్ రెండవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలపై జరిగిన సమీక్ష సమావేశంలో పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రజలు ఎండకు గురికాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి, షామియానాలతో నీడ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు.

సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలలో పారిశుధ్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిరంతరాయంగా త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా జోంగ్తు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, టీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More
Next Story