అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఈ నెల 10వ తేదీ నుండి హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ 2025కు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృత స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ను సీఎస్ ఆదేశించారు. విమానాశ్రయం, హోటళ్లు, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే వేదికల వద్ద గట్టి భద్రతను కల్పించాలని కోరారు. పోటీదారుల కోసం సవివరమైన బుక్లెట్ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణ
ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు, సాంకేతికత, సామర్థ్యం ఉన్న వైద్యులు, ఉన్నత నాణ్యత గల చికిత్సలను అందిస్తూ ఇప్పటికే తెలంగాణ అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తోంది.మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ వైద్య పర్యాటక పటంలో తెలంగాణ ప్రముఖ కేంద్రంగా మారనుంది.సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకాల మేరకు 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్ లో మెడికల్ టూరిజం ను ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.ఈ నెల 16 వ తేదీన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ ను అధికారులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రభావవంతమైన చికిత్సలు
అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే తెలంగాణలో చికిత్స ఖర్చులు 60-80శాతం తక్కువ. దాదాపు శతాబ్ద కాలంగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి , నిమ్స్ ,ఎంఎన్ జే కేన్సర్ ఆసుపత్రి, అపోలో హాస్పిటల్స్, యశోదా హాస్పిటల్స్, అపోలో కాంటినెంటల్ హాస్పిటల్స్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులు అత్యాధునిక సాంకేతికత (రోబోటిక్ సర్జరీ, టెలీమెడిసిన్), మల్టీస్పెషాలిటీ కేంద్రాలతో కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, క్యాన్సర్ చికిత్స, ట్రాన్స్ ప్లాంటేషన్, కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ,ఫెర్టిలిటీ చికిత్సలు , అవయవ మార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియలకు నిపుణులైన వైద్యులతో సమర్ధవంతమైన చికిత్స అందిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు
అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలో హార్ట్ సర్జరీకి/ బై పాస్ సర్జరీ ఒక లక్ష డాలర్లు అవుతుండగా హైదరాబాద్ లో మాత్రం కేవలం 5 వేల డాలర్ల నుం,ి 10 వేల డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. మోకాలు నీ రీప్లేస్ మెంట్ సర్జరీకి వెస్ట్రన్ కౌంటరి లలో 40 వేల నుంచి 60 వేల డాలర్లు అవుతుండగా, హైదరాబాద్ లో మాత్రం ఐదు వేల డాలర్ల లోపే అవుతున్నాయి. డెంటల్ సమస్యలకు విదేశాల్లో ఐదు వేల డాలర్లు అవుతుండగా మన దగ్గర వ్యయం తక్కువ అవుతుంది. విదేశాలనుంచి వైద్య అవసరాలకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు.
సంప్రదాయ వైద్యం అందుబాటులో...
ఆధునిక వైద్యంతో పాటూ భారత సంప్రదాయ వైద్య విధానాల పట్ల విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్య విధానాలైనా ఆయుర్వేద, హోమియో, యునాని పై కూడా ప్రచారం నిర్వహించేందుకు, వాటి ప్రయోజనాలను తెలిపేందుకు తద్వారా భారత సంప్రదాయ వైద్య సేవలను విదేశీయులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
పెరిగిన విదేశీ హెల్త్ టూరిస్టులు
2014 సంవత్సరంలో 75 వేల 171 మంది విదేశీ విదేశీ హెల్త్ టూరిస్టులు వైద్య సేవలు పొందేందుకు హైదరాబాద్ కి రాగా,2024 సంవత్సరం వరకూ దశాబ్ద కాలంలో 1,55,313 మంది విదేశీయులు వచ్చారు.అదే సమయంలో 2024 సంవత్సరంలో 8,82, 39, 675 మంది రోగులు దేశంలోనీ వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణ కు వచ్చారు. ఇప్పటికే మెడికల్ టూరిజంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణతో మెడికల్ టూరిజంలో తెలంగాణ ను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.