
‘పేరుకే విచారణలు.. చర్యలుంటాయన్న నమ్మకం లేదు’
అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోండని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ను కోరారు. తెలంగాణ ప్రాజెక్ట్లను గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏటీఎంలుగా మార్చుకున్నాయని విమర్శించారు. బనచర్ల ప్రాజెక్ట్ విషయంపై బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. అనంతరం రేవంత్ రెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిపై గురువారం.. ఈటల స్పందించారు. అవినీతి జరిగితే యాక్షన్ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విచారణలు జరగడమే తప్ప చర్యలు ఉంటాయన్న నమ్మకం తనకు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కాళేశ్వరంపై ఏమైనా అనుమానాలు ఉంటే.. ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న మంత్రులు ఇప్పుడు రేవంత్ కేబినెట్లో కూడా ఉన్నారని, వారిని అడగాలని సూచించారు.
‘‘క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా. ఆధారాలు అన్నీ ఇస్తాం. బట్ట కాల్చి మీద వేస్తున్నారు. ప్రతి నిర్ణయం క్యాబినెట్ రాటిఫికేషన్ జరుగుతుంది. కాళేశ్వరం అన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తా. మీ డిపార్ట్మెంటో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా క్యాబినెట్ లో పెట్టండి అని కెసిఆర్ చెప్పే వారు ఇది నిజం కాదంటే నేను దేనికైనా సిద్ధం. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలి. ప్రాజెక్ట్ నిర్మించాలి కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం సాగింది. నేను జైళ్లకు పోయిన, నా రక్తం చిందిది, పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది. ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా ?’’ అని ప్రశ్నించారు.
‘‘అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదు. జలయజ్ఞంలో ప్రాణహిత చేవెళ్ల 5 ఏళ్లలో పూర్తి చేసే ప్రాజెక్ట్ నా కదా ? ఎందుకు చేయలేదు. కమీషన్ త్వరగా పూర్తి చేయాలి అవినీతి నిగ్గు తేల్చాలి. బీజేపీ అయితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. బీజేపీ ప్రాజెక్ట్స్ కట్టడానికి వ్యతిరేకం కాదు. అధికారం అడ్డం పెట్టుకొని టెండర్ లేకుండా పనులు పంచుకోవడం తప్పు. ఏటీఎంగా మార్చుకున్న కల్చర్ను తప్పు పడుతున్నాం. దమ్ముంటే రిపోర్ట్ మీద చర్యలు తీసుకో. కుంగి పిల్లర్లు రిపేరు చేసి నీళ్లు ఇవ్వు. అవినీతి చేసిన వారిని వదలపెట్టవద్దు. బణకచర్లలో కూడా నన్ను బంధనం చేయాలని చూస్తున్నారు. పోతిరెడ్డి పేరుతో అన్యాయంగా మన నీళ్లను తీసుకుని పోతుంటే దుర్మార్గం అని చెప్పి పులిబిడ్డలా కోట్లాడింది నేను. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి జెండాకు ఎక్కింది నేను. అవి ఎక్కడికీ పోవు.. ఇప్పుడు బదనం చేయాలని చూస్తే ప్రజలు నమ్మరు’’ అని అన్నారు.