బార్‌లో కల్తీ మద్యం విక్రయం, మందుబాబులు బీ అలర్ట్
x
బార్ లో కల్తీ మద్యం విక్రయాల సీజ్

బార్‌లో కల్తీ మద్యం విక్రయం, మందుబాబులు బీ అలర్ట్

కల్తీ..కాదేది అనర్హం అంటూ హైదరాబాద్ నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండగా ఎక్సైజ్‌శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


పప్పుల నుంచి కారం, పసుపు, పాలు, పెరుగు, అల్లం, బెల్లం ఇలా.. ఒకటేమిటీ అన్నింటా కల్తీ..కల్తీ వస్తువుల విక్రయాలను మనం నిత్యం చూస్తున్నాం.చివరకు మద్యాన్ని కూడా కల్తీ చేన్తున్న బాగోతం హైదరాబాద్ నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో వెలుగు చూసింది.


మద్యం కల్తీ బాగోతం
ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు బార్ లో మద్యాన్ని కల్తీ చేస్తూ ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.లింగంపల్లి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని అయ్యప్ప సోసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్స్‌ బార్‌ను రెన్యువల్‌ చేయలేదు.దీంతో లైసెన్సు ఫీజు కూడా చెల్లించలేదని రంగారెడ్డి ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ సిబ్బంది బార్‌ లోకి వెళ్లి తనిఖీలు చేయగా కల్తీ బాగోతం వెలుగుచూసింది.

ఖరీదైన మద్యం బాటిల్ లో తక్కువ ధర లిక్కర్ కలిపి...
మాదాపూర్ బార్‌లో కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ,పునిక్‌ పట్నాయక్‌ కలిసి ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్‌ తీసి తక్కువ ధర ఉన్న మద్యాన్నికలుపుతుండగా ఎక్సైజ్ శాఖ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.అధిక ధరల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతున్న వారిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు.

రూ. 1.48 లక్షల కల్తీ మద్యం పట్టివేత
ఫుల్ బాటిల్ మద్యం బాటిల్ ధర రూ. 2,690 ఉన్న జెమ్‌సన్‌ బాటిల్లో రూ.1000 ధర ఉన్న ఓక్స్‌మిత్‌ మద్యాన్ని కలుపుతుండగా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు.బార్ లో మద్యాన్ని కల్తీ చేస్తున్న ఘటన స్థలంలో ఎక్కువ బాటిళ్లలో తక్కువ ధరలు ఉన్న మద్యాన్ని నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.రూ.1.48 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, బార్‌ లైసెన్స్‌ ఓనర్‌ ఉధయకుమార్‌ రెడ్డి, మేనేజర్‌ వి.సత్యనారాయణ రెడ్డి,బార్‌ పని చేసే ఉద్యోగి పునిత్‌ పట్నాయక్‌లపై కేసు నమోదు చేసినట్లు ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ తెలిపారు.


Read More
Next Story