
రోగం నయం చేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు
పాతబస్తీలో ఓ బాబా నిర్వాకం
యువతికి రోగం నయం చేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ నవాబ్ సాబ్ కుంటలో ఓ యువతి అనారోగ్యానికి గురి అవడంతో కుటుంబ సభ్యులు అదే బస్తీలో ఉన్న బాబా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ యువతిని పరీక్షించిన బాబా ట్రీట్ మెంట్ చేస్తానని చెప్పి యువతి ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడు.బాబా మంత్రం వేసి రోగం నయం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు నమ్మారు. మాయమాటలు చెప్పి యువతిని బాబా వశపరచుకున్నాడు. దర్గాలో మంత్రం వేస్తానని చెప్పి ఓ రోజు యువతి ఇంటి నుంచి బాబా తీసుకెళ్లాడు. కొన్ని రోజుల పాటు ఆ యువతి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తొలుత యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిని లోబరచుకుని బాబా పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది.యువతి మేజర్ కావడంతో బాబాపై నమోదైన కేసుపై పోలీసులు చర్య తీసుకోలేదు . ఎందుకంటే పెళ్లి చేసుకున్న యువతి తన తల్లిదండ్రులకు, పోలీసులకు ఫోన్ చేసి తన ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్టు చెప్పడంతో కేసు క్లోజ్ అయ్యింది. పోలీసుల విచారణలో కూడా యవతి ఇదే విషయాన్ని చెప్పింది. బాబాకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నట్టు సమాచారం.