తెలంగాణలో వరద బీభత్సం, 504 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
x
తెలంగాణ వరదల్లో చిక్కుకున్న మహిళలను రక్షిస్తున్న సహాయ సిబ్బంది

తెలంగాణలో వరద బీభత్సం, 504 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు

అతి భారీవర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం


తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం రికార్డు స్థాయిలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరదలు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 504 మంది బాధితులను ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్టుమెంట్ అధికారులు కాపాడారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం కల్యాణ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉన్న అన్నాసాగర్ గ్రామం వద్ద 9 మంది వరదల్లో చిక్కుకుపోగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది వారిని కాపాడి సురక్షిత స్థలానికి తరలించారు. జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.




కామారెడ్డి జిల్లా బాన్స్ మొహమ్మద్ నగర్ మండలం గున్ కుల్ గ్రామం వద్ద వరదల్లో చిక్కుకుపోయి అయిదుగురిని బాన్స్ వాడ ఫైర్ సిబ్బంది కాపాడారు. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ వద్ద వరదప్రాంతాల్లో చిక్కుకున్న 50 మందిని కామారెడ్డి ఫైర్ స్టేషన్ సిబ్బంది రక్షించారు.




మెదక్ జిల్లాలో...

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వరదనీటిలో మునిగింది. దీంతో 150 మంది విద్యార్థినులను రామాయంపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. రామాయంపేట పట్టణంలోని బాలాజీనగర్, బీసీకాలనీల్లో వదరనీటిలో చిక్కుకున్న 10 మందిని రామాయంపేట ఫైర్ సిబ్బంది కాపాడారు. రామాయంపేటలోని ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ వరదనీటిలో మునిగింది. దీంతో హాష్టల్ లో ఉన్న 80 మదిని రామాయంపేట ఫైర్ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.



ట్యాంకరుపైకి ఎక్కిన కార్మికులు

కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డి కల్యాణి వాగు వరదలతో బొగ్గుగుడిసె సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదనీటిలో చిక్కుకున్నారు. వారు ట్యాంకరు పైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు కామారెడ్డి -భిక్కనూర్ వద్ద రైలు పట్టాల వద్ద గండి పడింది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా నీట మునిగింది. హవేలీ ఘనపూర్ చెరవులు తెగిపోయి పసుపులేరు వాగులో నీరు ప్రవహిస్తోంది. రామాయంపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది. కారు, ఆటో కొట్టుకుపోవడంతో నలుగురు గల్లంతు అయ్యారు. వరదల వల్ల 11వేల కోళ్లు మృతి చెందాయి.

రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉంది

రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉన్నదనీ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాలని కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖకు ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ టీమ్ లను రంగం లోకి దించారు.



Read More
Next Story