తెలంగాణలో గూగుల్ సేఫ్టీ సెంటర్
x

తెలంగాణలో గూగుల్ సేఫ్టీ సెంటర్

ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుంది.


ఆసియాలో తన తొలి సేఫ్టీ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ రెడీ అయింది. ఈ సెంటర్‌ను తెలంగాణలో పెట్టాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గూగుల్ ఇన్నొవేటివ్ కంపెనీ అయితే తమది ఇన్నొవేటివ్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులు అని, విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, హెల్త్ ఇలా అనేక రంగాలలో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉందన్నారు. ‘‘ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమే. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయింది. నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి’’ అని పేర్కొన్నారు.

‘‘మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాము. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాము. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. ఇది నైపుణ్య అభివృద్ధి పై దృష్టి పెడుతుంది. ఉపాధిని సృష్టించడం తో పాటు దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం ..ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నాను. గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నాను. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయి.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలి’’ అని తెలిపారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందని నాకు కచ్చితంగా తెలుసు. మీకు సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది. దీనిని మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తాము. 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నాము. గూగుల్ ఆఫీస్ పక్క ని రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశాం. మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం. మేము మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం’’ అని స్పష్టం చేశారు.

‘‘వీటన్నిటికీ, నాకు మీ మద్దతు అవసరం. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్న. గూగుల్ , హైదరాబాద్ పాత స్నేహితులు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నాము. గూగుల్ ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం. మా ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించాం. గత ప్రభుత్వాలు ట్రాన్సజెండర్స్ ని నిర్లక్ష్యం చేశాయి’’ అని అన్నారు.

‘‘GHMC కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకుంటోంది. నాణ్యమైన విద్య మా లక్ష్యం.. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకువస్తున్నాం. తెలంగాణ లో ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్ ల నుంచి వస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యం లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం. ఇవే నా ప్రధాన ఆవిష్కరణలు. గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

Read More
Next Story