ఏడుగురు తెలంగాణ ప్రముఖులకు గవర్నర్ సత్కారం
x
తెలంగాణ ప్రముఖ కళాకారులకు గవర్నర్ సత్కారం

ఏడుగురు తెలంగాణ ప్రముఖులకు గవర్నర్ సత్కారం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాల్లో భాగంగా ఏడుగురు తెలంగాణ కళాకారులను గవర్నర్ జిష్ణుదేవ వర్మ సన్మానించారు.


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు రాజ్ భవన్ లో సోమవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఏడుగురు వ్యక్తులను సత్కరించి అభినందించారు.ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య,అంతడుపుల నాగరాజు,దాస్యం తరుణ్ భాస్కర్,హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి,డా.చింతపల్లి వసుంధరా రెడ్డి,సివి అంబాజీ,డాక్టర్ మామిడి హరికృష్ణలను గవర్నర్ సన్మానించారు.


ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య చిందు యక్ష గాన కళా సంప్రదాయాన్ని ఎన్నో అంతర్జాతీయ జాతీయ వేదికలపై ప్రదర్శించారు. అంతడుపుల నాగరాజు తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో ప్రజలందరినీ ఏకీకృతం చేశారు. ఈయన సాంస్కృతిక విభాగం తెలంగాణ ధూమ్ దాం పాటతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి చెప్పారు.దాస్యం తరుణ్ భాస్కర్ “సైన్మా” అనే షార్ట్ ఫిలిం తో ప్రారంభించి. తెలంగాణ సినిమాకు కొత్త బాటలు వేసి “పెళ్లి చూపులు” సినిమా దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు.జాతీయస్థాయిలో ఉత్తమ మాటల రచయితగా, జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకొని, తెలంగాణ భాషకు జాతీయ గౌరవాన్ని తీసుకొచ్చారు.

హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి కర్ణాటక శాస్త్రీయ సంగీతపు మాధుర్యాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. డా.చింతపల్లి వసుంధరా రెడ్డి అధ్యాపకురాలిగా, పరిశోధకురాలుగా, జానపద కళల పరిరక్షకురాలిగా ప్రత్యేక సేవలందించారు. సివి అంబాజీ వివిధ జాతీయ, అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొని తెలంగాణకు ఖ్యాతి తీసుకు వచ్చారు.డాక్టర్ మామిడి హరికృష్ణ రచయితగా, కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా, బహుముఖ ప్రతిభాశాలిగా పేరు గడించిన హరికృష్ణ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా తెలంగాణ జానపద గిరిజన, శాస్త్రీయ, హైదరాబాదీ దక్కని కళారూపాలకు విశిష్టతని తీసుకువచ్చారు.


Read More
Next Story