
రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు..
అధికారుల అసలత్వం, నిర్లక్ష్యం వల్ల ‘భూభారతి’ మరో ‘ధరణి’ కాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది.
తెలంగాణను భూసమస్యల రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ సదస్సుల ద్వారా 8లక్షలకు పైగా భూసమస్యల దరఖాస్తులు చేరాయి. కాగా వీటిలో చాలా వాటిని అధికారులు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నది కూడా బాధితులకు చెప్పడం లేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలిచ్చింది. ప్రతి ఫిర్యాదును స్వీకరించి.. పరిష్కరించాలని చెప్పారు. అదే విధంగా రిజెక్ట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నాం అన్న విషయాన్ని బాధితులకు సవివరంగా చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని ప్రభుత్వం తెలిపింది. లిఖితపూర్వకమైన కారణం లేకుండా ఏ దరఖాస్తును తిరస్కరించడానికి వీలు లేదని ప్రభుత్వం తెలిపింది.
గత ప్రభుత్వంలోనూ ఇదే పద్దతి..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా సిబ్బంది ఇతే పంథాను అనుసరించారు. వచ్చిన దరఖాస్తులను కింది స్థాయి సిబ్బంది అకారణంగా రిజెక్ట్ చేశారు. అందువల్లే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో రెవెన్యూ సద్దుస్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో కూడా అధికారులు అదే వైఖరిని అనుసరిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫీల్డ్ లెవెల్లో కూడా తహశీల్దార్లు ఇష్టారీతిన దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిసిందని, అది సరైన పద్దతి కాదని చెప్పింది. భూభారతి చట్టం ప్రకారం.. పోర్టల్లో ఏ అప్లికేషన్ వచ్చినా.. దానిని సరైన కారణం లేకుండా రిజెక్ట్ చేయడానికి వీలులేదని గుర్తు చేసింది. అంతేకాకుండా దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉందని, లేనిపోని, చిన్నచిన్న కారణాలు చెప్పి అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తూ కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
మళ్ళీ ధరణి రిపీట్ కాకూడదు..
బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ తీసుకొచ్చి భూసమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. పైగా కొత్త సమస్యలు తలెత్తాయి. రైతులు నానాఅవస్థలు పడ్డారు. వాటిని పరిష్కరించడానికి, కొత్తవి ఉత్పన్నం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూభారతి’ చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అధికారుల అసలత్వం, నిర్లక్ష్యం వల్ల ఇది మరో ‘ధరణి’ కాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి అధికారి కూడా నిబద్దతతో పనిచేయాలని సూచించింది. బాధితులు పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యల పరిష్కారం జరగాలని తెలిపింది.