కాంగ్రెస్, బీజేపీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?
x
BJP Candidate Amji Reddy and Congress candidate Narendra Reddy

కాంగ్రెస్, బీజేపీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

పార్టీ రహితంగా బీసీలందరు ప్రసన్నకు ఓట్లేసి గెలిపించాలని బీసీల సంఘాల నేతలు బహిరంగంగా పిలుపివ్వటం, ప్రచారంచేయటం బాగా ప్రభావం కనిపించిందని అంటున్నారు.


తాజాగా మూడు ఎంఎల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో చర్చంతా ఒక్క సీటుగురించే జరుగుతోంది. ఆ సీటు ఏమిటంటే మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నిక. ఈనెల 27వ తేదీన ఒక గ్రాడ్యుయేట్+2 టీచర్ ఎంఎల్సీ సీట్లకు ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మూడుసీట్లకు ఎన్నికలు జరిగినా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం మీద మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోంది ? ఎందుకంటే ఇందుకు కొన్ని కీలకమైన కారణాలున్నాయి. మొదటిది పోటీచేయని బీఆర్ఎస్ ఓట్లు పోటీచేసిన పార్టీల్లో ఎవరికి పడ్డాయనే విషయంలో క్లారిటిలేక అయోమయం పెరిగిపోతోంది. రెండో కారణం గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)ల మధ్యే పోటీ అని చాలామంది అంచనా వేసినా అందరి అంచనాలను తల్లకిందులుచేస్తు బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ(BSP Candidate Prasanna) ఒక్కసారిగా దూసుకురావటం. మూడోపాయింట్ రెండు టీచర్ ఎంఎల్సీ సీట్లలో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండటం. నాలుగోపాయింట్ ఏమిటంటే ‘బీసీ’ నినాదం బాగా హైలైట్ అవ్వటం.

పై కారణాలతోనే గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎంఎల్సీ గెలుపోటములపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. తాజా ఎన్నికల్లో ఓటింగ్ సగటు సుమారు 85 శాతంగా నమోదవ్వటం కూడా మరో కారణం. పోయిన ఎన్నికల్లో పై మూడుసీట్ల ఎన్నికలో సగటు ఓటింగ్ సుమారు 60 శాతం మాత్రమే. అంటే పోయిన ఎన్నికతో పోల్చుకుంటే తాజా ఎన్నికలో 25 శాతం ఓటింగ్ ఎక్కువగా జరిగింది. 25 శాతం ఓటింగ్ అదనంగా జరగటం మామూలు విషయంకాదు. అందుకనే పెరిగిన 25 శాతం ఓటింగ్ ఎవరిని గెలిపిస్తుందో ? ఎవరిని ఓడిస్తుందో అర్ధంకావటంలేదు.

గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నికలో గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్రౌండ్ రిపోర్టు, పోల్ సర్వేల ప్రకారం పోటీ ప్రధానంగా బీజేపీ-బీఎస్పీ అభ్యర్ధుల మధ్యే ఉంటుందని. మామూలుగా అయితే పోటీ కాంగ్రెస్ అభ్యర్ధి వూటుకూరి నరేంద్రరెడ్డి, బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి మధ్యే ఉంటుందని అందరు అనుకున్నారు. ఇద్దరిలో కూడా అంజిరెడ్డికి కాస్త మైలేజ్ ఉంటుందని అంచనాలు వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ దూసుకొచ్చారు. అంజిరెడ్డి, నరేంద్రరెడ్డి పార్టీల ఓట్లపైన ఎక్కువగా ఆధారపడ్డారు. ఇదేసమయంలో ప్రసన్న బీసీ నినాదాన్ని ఆయుధంగా చేసుకుని రేసులోకి దూకారు. బీసీ సామాజికవర్గాలతో ప్రసన్న చాలా మీటింగులు పెట్టాడు. బీసీ సంఘాల్లోని కీలకనేతలను ప్రసన్నంచేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకనే పార్టీ రహితంగా బీసీలందరు ప్రసన్నకు ఓట్లేసి గెలిపించాలని బీసీల సంఘాల నేతలు బహిరంగంగా పిలుపివ్వటం, ప్రచారంచేయటం బాగా ప్రభావం కనిపించిందని అంటున్నారు.

ప్రసన్న బీసీ అస్త్రం ఏ స్ధాయిలో పనిచేసిందంటే కాంగ్రెస్ అభ్యర్ధి పోటీలో ఉన్నా తమ అభ్యర్ధిని కాదని పార్టీ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న లాంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు ప్రసన్నకు బహిరంగంగానే మద్దతుపలికి ప్రచారం చేశారు. అలాగే బీజేపీలో కూడా కొందరు బీసీ నేతలు ప్రసన్నకు లోపాయికారీగా సహకరించారనే ప్రచారం జరుగుతోంది. సో, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ప్రచారం కరెక్టే అయితే పోటీ అంజిరెడ్డి-ప్రసన్న మధ్యే ఉంటుంది. చివరకు ప్రసన్న గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రరెడ్డి మూడోస్ధానానికే పరిమితమవుతారని పార్టీలోనే టాక్ నడుస్తోంది.

హరీష్ రావు తదితరులతో తనకున్న సాన్నిహిత్యాన్ని ప్రసన్న బాగా ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఎలాగూ బీఆర్ఎస్ పోటీచేయటంలేదు కాబట్టి ఆ పార్టీ ఓట్లు తనకే పడేట్లుగా ప్రసన్న మ్యానేజ్ చేసుకున్నారని తెలిసింది. జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే నరేంద్రమోడీ(Narendra Modi), రేవంత్ రెడ్డి(Revanth) పరిపాలనను ఎక్కువమంది ఓటర్లు పట్టించుకోలేదని అర్ధమవుతోంది. మెజారిటి ఓటర్లు ఏ అంశంమీద ఓట్లేశారంటే కేవలం బీసీ సామాజికవర్గం అభ్యర్ధి అన్న పాయింట్ మీదే ఓట్లేశారని సమాచారం. ఇపుడు తెలంగాణ(Telangana)లో బీసీ(BC Coin) నినాదం బాగా కాయిన్ అవుతున్న విషయం తెలిసిందే. మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీసీ సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్ధానికసంస్ధల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చిన దగ్గర నుండి బీసీ నినాదం బాగా ఊపందుకుంటోంది. రేవంత్ ను ఇరుకునపెట్టడానికి బీఆర్ఎస్-బీజేపీలోని కీలకనేతలు కూడా పదేపదే బీసీజపం చేస్తున్నారు. దాంతో ఇపుడు తెలంగాణలో బీసీలకు రాజ్యాదికారం, బీసీ నేతకే ముఖ్యమంత్రి పదవి లాంటి అంశాలు ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈమధ్యనే బయటపెట్టిన కుటుంబసర్వే తో బీసీ సామాజికవర్గంపై చర్చ బాగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారైతే బీసీ సామాజికవర్గం అవటం ప్రసన్నకు బాగా కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అందుకనే ప్రసన్న గెలిస్తే ఎక్కువ క్రెడిట్ బీసీ నినాదానికే దక్కుతుందనటంలో సందేహంలేదు. మరి మార్చి 3వ తేదీన కౌంటింగులో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

Read More
Next Story