
ఓఆర్ఆర్ను అష్టదిగ్భంధనం చేస్తాం: హరీష్ రావు
రెండు సార్లు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయలేదు.
రేవంత్ పాలన చూస్తుంటే ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ గుర్తొస్తుందంటూ మాజీ మత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగానికి కష్టాలు పెరిగిపోయాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాజుల్లా ఉన్న రైతన్నలు.. ఈ ప్రభుత్వ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, కొందరికి మాత్రమే పథకాన్ని అందిస్తుందని ఆగ్రహించారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చాలా ఎకరాల సాగు భూమి రైతులకు రైతు భరోసా అందలేదని, కాదు కాదు విడుదల చేయలేదంటూ చురకలంటించారు. అన్ని వర్గాల సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఈ ప్రభుత్వం వచ్చి వాటిలో కోతలు పెట్టడం తప్ప చేసిందేమీ లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘రెండు సార్లు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయలేదు. కరోనా సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అందించింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం రైతులకు బేడీలు వేయడం తప్ప చేసిందేమీ లేదు. అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించిన చరిత్ర రేవంత్ రెడ్డిదే. ఇప్పుడే చెప్తున్నాం. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలి. లేని పక్షంలో 2 లక్షల మంది రైతులతో ఓఆర్ఆర్ను అష్టదిగ్భంధనం చేస్తాం’’ అని హెచ్చరించారు హరీష్ రావు.