
‘ఇంకెన్నాళ్లూ మాటలతో మభ్యపెడతావు రేవంత్’
ఇప్పటికయినా గాలి మాటలు మానుకుని పనులు చేయడం మొదలు పెట్టాలని సూచించిన హరీష్ రావు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి అయినా గాలి మాటలు చెప్పడం మానుకుని పనులు చేయడం ప్రారంభించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. ఇంకెంత కాలం ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటావంటూ రేవంత్పై విమర్శనాస్త్రాలు సంధించారు. స్కావెంజర్లకు వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ‘‘రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం! గాలి మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తవు రేవంతు రెడ్డి? ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య! చిరు ఉద్యోగుల శ్రమను, కష్టాన్ని గౌరవించడం మీకు చేతకాదా?’’ అని ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కోసం, స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు పేద విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకం నిధులు సైతం ఏడాదిగా పెండింగ్లో పెట్టారు. కెసిఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించకుండా అమలు గాలికి వదిలేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్.. మీ సొంత శాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతన సమస్యలు కనిపించడం లేదా? ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారు’’ అని చురకలంటించారు.
‘‘మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం ఉద్యోగులను మోసం చేస్తారు? సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులైన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధించడం అమానవీయం, అనైతికం! రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తున్నామని చెబుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆవేదన వింటే మనస్సు చెలించిపోతున్నది. మధ్యాహ్న భోజన పథకం సహా విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, స్కావెంజర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.