మూడు ఛానళ్ళని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా ?
x
BRS leader Guntakalla Jagadeeswar Reddy

మూడు ఛానళ్ళని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా ?

టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసులో కేసీఆర్, కేటీఆర్ మీద అసత్యప్రచారాలు చేస్తున్నట్లు మండిపడ్డారు.


కారుపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి గుంటకళ్ళ జగదీశ్వరరెడ్డి చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది. ఆయన ఏమన్నారంటే కేసీఆర్ క్షమించినా తాము యెల్లోమీడియాను వదిలిపెట్టే ప్రశక్తేలేదట. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసులో కేసీఆర్, కేటీఆర్ మీద అసత్యప్రచారాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. మహాన్యూస్ మీద జరిగింది దాడికాదని కేవలం నిరసన మాత్రమే అని సమర్ధించుకున్నారు. ఇదేసమయంలో ఇంకా రెండు, మూడు ఛానళ్ళున్నట్లు చేసిన హెచ్చరికలు సంచలనంగా మారాయి. అంటే తొందరలోనే మరో మూడు మీడియా సంస్ధలపై దాడులుచేస్తామని పరోక్షంగా వార్నింగ్ ఇవ్వటమే.

శనివారం మధ్యాహ్నం మహాన్యూస్ ఛానల్ ఆఫీసుపైన బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు దాడిచేసిన విషయం తెలిసిందే. మహాన్యూస్ లో టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేటీఆర్(KTR) పై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారన్న మంటతో పార్టీకి చెందిన కొందరు మూకుమ్మడిగా దాడిచేశారు. ఆఫీసు ముందు పార్క్ చేసిన కార్లను, ఆఫీసులోకి చొచ్చుకునిపోయి ఫర్నీచర్, కెమెరాలు, అద్దాలను కూడా ధ్వంసంచేయటం సంచలనంగా మారింది. జరిగిన దాడిని బీఆర్ఎస్ నేతలు ఒకరకంగా సమర్ధించుకుంటుంటే మంత్రులు, కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు.

ఈ నేపధ్యంలోనే ఆదివారం మీడియాతో జగదీష్(BRS Jagadeeswar Reddy) మాట్లాడుతు ఇంకో మూడు ఛానళ్ళపై దాడులు చేస్తామన్నట్లుగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తాము నిరసన మాత్రమే చేశామని, నిజంగానే దాడిచేసుంటే వేరే లెవల్లో ఉండేదన్నారు. మీడియా సంస్ధలను పోలీసులు కూడా కాపాడలేరని వార్నింగ్ ఇచ్చారు. మీ బలుపేంటి ? అహంకారం ఏమిటని నిలదీశారు. ఎవరిని చూసుకుని కేటీఆర్ మీద తప్పుడు కథనాలు ప్రసారంచేస్తున్నారంటు ప్రశ్నించారు.

ఎక్కడ ఉంటున్నారు ? ఎక్కడ బతుకుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎవరితిండి తింటుతింటున్నారో గుర్తుపెట్టుకోవాలని కూడా అన్నారు. తమ సహనానికి ఒక హద్దు ఉంటుందన్న విషయం తెలుసుకోవాలని చెప్పిన గుంటకళ్ళ సహనం నశించినట్లు చెప్పారు. కొన్ని యాజమాన్యాలు మీడియా హౌజుల పేరుతో తమ నేతల వ్యక్తత్వ హననానికి పాల్పడుతు స్లాటర్ హైజులు నపుడుతున్నట్లు మండిపడ్డారు. మీడియా చేతిలో ఉందికదాని ఇష్టంవచ్చినట్లు రాస్తుంటే చూస్తు ఊరుకోవాలా ? అని ప్రశ్నించారు. ఏపీ నుండి తెలంగాణను కేసీఆర్(KCR) విడదీశారన్న కోపంతోనే అసత్య కథనాలు ప్రసారంచేస్తున్నట్లు జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

Read More
Next Story