
దుర్గంగుట్టలు మావోయిస్టుల కొత్త షెల్టర్ జోన్ గా మారిందా ?
భద్రతాదళాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే కొందరు మావోయిస్టులు కర్రెగుట్టల అడవుల నుండి కాస్త దూరంగా ఉన్న దుర్గంగుట్టల అడవుల్లోకి పారిపోయారు
మావోయిస్టుల షెల్టర్ జోన్ కర్రెగుట్టల అడవుల నుండి దుర్గంగుట్టల అడవుల్లోకి మారిందా ? భద్రతాదళాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినబడుతోంది. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్-మహారాష్ట్ర మధ్యలో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు సమవేశం అవుతున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆపరేషన్ కగార్ (Operation Kagar)మొదలుపెట్టింది. 288 చదరపు కిలీమీటర్ల పరిధిలో విస్తరించున్న కర్రెగుట్టల(Karreguttala forest) అడవుల్లోకి కొత్తవాళ్ళు ఎవరూ ప్రవేశించలేరు. ఎందుకంటే వందలాది చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించున్న ఈ అడవులు చాలా దట్టమైనవి. అడవుల్లో ఎత్తైన గుట్టలు, పెద్దపెద్ద గుహలు కొన్ని వందలున్నాయి. చాలాసంవత్సరాలుగా మావోయిస్టులుతలదాచుకోవటానికి, కీలకసమావేశాలు నిర్వహించుకోవటానికి కర్రెగుట్టల అడవులను షెల్టర్ జోన్(Maoist shelter zone) గా ఉపయోగించుకుంటున్నాయి.
ఈఅడవుల్లో మావోయిస్టులు సుమారు 1500 మంది సమావేశమవుతున్నారని, ఇందులో కూడా రాష్ట్ర, కేంద్ర కమిటీల్లోని 80 మంది కీలక నేతలు ఉన్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందటంతోనే గాలింపుచర్యలు మొదలైపోయాయి. ఇపుడు అడవుల్లో మావోయిస్టులు-భద్రతాదళాల పరిస్ధితి ఎలాగ తయారైందంటే ‘పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటం’ లాంగ తయారైంది. అడవులను పై మూడురాష్ట్రాల సరిహద్దుల్లోను భద్రతాదళాలు కమ్ముకునేశాయి. భద్రతాదళాలను కాదని అడవుల్లో నుండి తప్పించుకుని బయటపడటం మావోయిస్టులకు చాలాకష్టం. అయితే భద్రతాదళాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే కొందరు మావోయిస్టులు కర్రెగుట్టల అడవుల నుండి కాస్త దూరంగా ఉన్న దుర్గంగుట్టల అడవుల్లోకి పారిపోయారు. దుర్గంగుట్టల అడువుల్లోకి ప్రవేశించటం దుర్లభమనే చెప్పాలి.
50 చదరపు కిలోమీటర్ల విస్తరించిన దుర్గంగుట్టల దట్టమైన అడవులను కూడా మావోయిస్టులు చాలాకాలంగా షెల్టర్ జోన్ గా ఉపయోగించుకుంటున్నారు. నిజానికి భద్రతాదళాలు చుట్టుముట్టేంతవరకు కర్రెగుట్టలు, దుర్గంగుట్టల అడవులు మావోయిస్టులకు షెల్టర్ జోన్లన్న విషయం చాలామందికి తెలీదు. మావోయిస్టులు తమ షెల్టర్ జోన్లను అంతరహస్యంగా ఉంచుతారు. కర్రెగుట్టల్లోకి ఆదివాసీలు రావద్దని మావోయిస్టులు చెప్పటం, మందుపాతరలు, బాంబులు అమర్చిన విషయాన్ని ఆదివాసీలతో చెప్పటంతోనే ఈ అడవులు షెల్టర్ జోన్ అన్న విషయం బయటపడింది. ఒకవైపు కర్రెగుట్టలను జల్లెడపడుతున్న భద్రతాదళాలు ఇదే ఊపులో దుర్గంగుట్టలను కూడా జల్లెడ మొదలుపెట్టాయి.
దుర్గంగుట్టల్లో కూంబింగ్ చేయటం భద్రతాదళాలకు అంత తేలికకాదని స్ధానిక ఆదివాసీలు చెబుతున్నారు. ఎందుకంటే దుర్గంగుట్టల అడవుల్లో చాలాప్రాంతాల్లో చిత్తడినేలలతో కూడిన ఊబిలున్నాయి. అలాగే వందలసంఖ్యలో పెద్ద గుహలు(Bunkers) కూడా ఉన్నాయి. ఎక్కడగుహల్లో మావోయిస్టులు దాక్కున్నారో తెలుసుకోవటం భద్రతాదళాలకు అంత తేలికకాదు. కొన్నివారాలకు సరిపడా ఆహారం, నీటిని మవోయిస్టులు గుహల్లో భద్రపరుచుకునే అవకాశాలున్నాయి. కర్రెగుట్టలో బయటపడిన ఒక బంకర్ లేదా గుహలో సుమారు వెయ్యిమంది తలదాచుకోవటానికి సరిపడా సౌకర్యాలను భద్రతాదళాలు గుర్తించాయి. ఇలాంటి బంకర్లు కర్రెగుట్టల అడవుల్లో వందలసంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికి భద్రతాదళాలు వంద గుహలను గుర్తించాయి. ఇంకా గుర్తించాల్సిన గుహలు చాలానే ఉన్నాయి. ఇలాంటి గుహలే దుర్గంగుట్టల అడవుల్లో కూడా ఉన్నాయి.
ఒకవేళ మావోయిస్టులు కర్రెగుట్టలు, దుర్గంగుట్టల అడవుల్లోని గుహల్లో తలదాచుకున్నా తమదగ్గరున్న ఆహారం, నీరు అయిపోయేంతవరకు భద్రతాదళాల కంటపడకుండా దాక్కుంటారు. ఒకవేళ భద్రతాదళాలు గుహల్లో ప్రవేశిస్తే అప్పుడు కాల్పులు తప్పవు. పైనచెప్పిన రెండుఅడవుల్లోను ముందుజాగ్రత్తగా భద్రతాదళాలు బేస్ క్యాంపులు ఏర్పాటుచేసుకుంటున్నాయి. ప్రతి బేస్ క్యాంపులోను 500 మందికి తక్కువకాకుండా సాయుధ బలగాలను రెడీగా పెట్టుకున్నాయి. అలాగే తమ అవసరాల కోసం కర్రెగుట్టల ప్రాంతంలోని గంజిపర్తి గ్రామంలో మొబైల్ టవర్ కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదుకాబట్టి భద్రతాదళాలు తెలంగాణలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో, ఛత్తీస్ ఘడ్ వైపున్న పామేడు, పూజారీ కాంకేర్ పరిసర గ్రామాల్లోని జనాలను ఇళ్ళల్లో నుండి బయటకు రానీయటంలేదు.