
‘హైకోర్టు స్టే.. కాంగ్రెస్ కుట్రను బయటపెట్టింది’
కేంద్రంలో బీజేపీ కూడా బీసీలకు వెన్నుపోటు పొడించిందంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.
బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు స్టే విధించడంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన స్టే.. బీసీలను కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న కుట్రను బహిర్గం చేసిందన్నారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో బీసీలను మభ్యపెట్టాలని, రాజకీయ లబ్ది పొందాలని రేవంత్ పన్నాగాలు పన్నారని, అవి కోర్టు ముందు నిలవలేదని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసి బిల్లును పంపితే.. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా బీసీలకు వెన్నుపోటు పొడిచిందన్నారు కేటీఆర్. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కోర్టు అడ్డుకుందన్నారు. ‘‘తనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఎన్నికల వాయిదా కోసం కాంగ్రెస్.. రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంది. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం తప్పదు’’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన స్టే తో 42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ సర్కారు ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదని రుజువైపోయిందని ఆయన పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందని కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాలరాసి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలను దారుణంగా మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం మభ్యపెట్టేందుకు తెచ్చిన జీఓ న్యాయస్థానాల్లో నిలబడదని బీఆర్ఎస్ చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
కులగణనను మొదలుకుని జీఓ దాకా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అడుగడుగున చేసినదంతా మోసం, దగా, నయవంచన తప్ప మరొకటి కాదు. కులగణన నుంచి మొదలుకొని ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వానికి అనేక సూచనలు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సింది పోయి, ఏకపక్షంగా దేశ రాజధానికి వెళ్లి ధర్నా పేరిట నాటకమాడారు" అని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికలకి ముందు రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి 42 శాతం బీసీలకు పదవులు కట్టబెడతామని చెప్పి, పూటకొక మాటను కాంగ్రెస్ మార్చిందన్నారు. చివరికి రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకున్నాక రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పిన అడ్డగోలు మాటల్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చేశారని, చివరికి న్యాయస్థానాల్లో నిలబడని జీఓతో మభ్యపెట్టారని ఆయన అన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కి, పార్టీ పరంగా ఇస్తామని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిన నాడే కాంగ్రెస్ మోసం బయటపడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.
22 నెలల చేతకాని పాలనపై ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, వ్యతిరేకతను చూసి ముఖ్యమంత్రి భయంతో వణికిపోతున్నారని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాని ప్రభుత్వం మరోవైపు తన అసమర్థ పరిపాలన విధానాలతో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను ఆపేసి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని, అందుకే స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి, ఏదో రకంగా వాయిదా వేయించేందుకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పావుగా వాడుకున్నారు అని ఆయన దుయ్యబట్టారు. "రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన దగాకు తోడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీ బిల్లులను పెండింగ్ లో పెట్టి వెనుకబడిన వర్గాలను దారుణంగా వెన్నుపోటు పొడిచింది" అని కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను, ముఖ్యమంత్రి చేసిన దుర్మార్గాన్ని చూసి రాష్ట్రంలోని బలహీనవర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఇప్పటికే పల్లెల్లో పాలన పడకేసి ప్రజలు అవస్థలు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పనికిరాని జీవోతో రాష్ట్రంలోని బీసీలను, గారడీ మాటల గ్యారెంటీ కార్డుతో నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు" అని కేటీఆర్ హెచ్చరించారు.