
సబితకు హైకోర్టు నోటీసులు..అక్రమ మైనింగ్ కేసులో ట్విస్ట్
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీమంత్రికి తిరిగి కష్టాలు తప్పవా..?
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు మరోమారు తలనొప్పిగా మారనుంది. ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు ,మాజీ ఐఏఎస్ కృపానందానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సబిత, కృపానందం లను నిర్దోషులుగా తేల్చుతూ నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈక్రమంలో హైకోర్టు వీరిద్దరికి తాజా ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మే నెలలో తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది.దోషులుగా నిర్ధారించిన వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల చొప్పున జరిమానా విధించింది.ఈ కేసులో అప్పట్లో గనుల శాఖ మంత్రిగా వున్న సబితా ఇంద్రారెడ్డికి పూర్తి ఉపశమనం కలిగిందని భావించారు. అయితే హైకోర్టులో సీబీఐ పిటీషన్ తో సబితతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంకు తిరిగి నోటీసులు జారీ కావడం తో కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నట్లైంది.
అయితే అనూహ్యంగా హైకోర్టులో ఈకేసు విచారణ నుంచి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి తప్పుకున్నారు. తాను గతంలో నిందితులలో ఒకరి తరపున వాదనలు వినిపించానని ,అందువల్ల సీబీఐ అప్పీల్ పై విచారణ చేపట్టలేనని తెలిపారు.దాంతో తాజాగా మరో న్యాయమూర్తి ఈకేసులో సీబీఐ విచారణపై విచారణ చేపట్టారు. సీబీఐ తరపున శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. దాంతో సబిత , కృపానందం లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Next Story