
మామునూరు ఎయిర్పోర్ట్ పనుల్లో తొలి ఆటంకం!
ఎయిర్పోర్ట్ వల్ల ఎంత లాభపడుతున్నామో.. అంతకన్నా ఎక్కువ నస్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా మామునూరు అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకోసం శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదంటూ జీఎంఆర్తో చేసుకున్న ఒప్పందాన్ని కూడా సవరించారు. ఈ మేరకు ప్రత్యేక చర్చలు జరిపి ఈ ప్రాజెక్ట్కు ఒప్పందం నుంచి మినహాయింపు అందుకుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అభివృద్ధి కొసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని రాష్ట్రభుత్వం త్వరితగతిన సేకరించాలని కేంద్రం తెలిసింది. కేంద్రం చెప్పడమే ఆలస్యంగా రాష్ట్ర సర్కార్ భూసేకరణ పనులను ప్రారంభించింది. ఇంతలోనే ఈ పనులకు ఆటంకం కలిగింది. భూసేకరణకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. మామునూరు విమానాశ్రయం చుట్టుపక్కల భూమిని సేకరించడానికి.. ఆ భూమ యజమానులను సంప్రదించింది. భూమికి పరిహారం అందిస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.
ఎయిర్పోర్ట్ కోసం భూములను కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. భూములకు న్యాయపరమైన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా నక్కలపల్లి రోడ్డును తీసేయొద్దని కోరారు. ఆ రోడ్డు తీసేస్తే రైతులు అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన ఆర్డీఓను నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ నిరసనలో మహిళలే అధికంగా పాల్గొన్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
‘‘మేము విమానాశ్రయం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఇక్కడ విమానాశ్రయం రావడం సంతోషకరమైన అంశమే. కానీ దాని వల్ల మాకు అన్యాయం జరగకూడదు. ఎయిర్పోర్ట్ వల్ల ఎంత లాభపడుతున్నామో.. అంతకన్నా ఎక్కువ నస్టపోతున్నాం. మాకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని, రైతులు కోరుకున్న ప్రాంతంలో వ్యవసాయ ఆమోద యోగ్యమైన భూములు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం భూములకు భూమి ఇవ్వడం లేదు. అంతేకాకుండా మా గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని కూడా మూసివేస్తున్నారు’’ అని రైతులు పేర్కొన్నారు.