
బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ ఎలా కౌంట్ చేస్తారో తెలుసా..!
మినిమమ్ బ్యాలెన్స్కు కొత్త రూల్స్ తెచ్చిన ఆర్బీఐ. ఎవరిపై ఎంత ప్రభావం అంటే.
బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్కు సంబంధించి ఆర్బీఐ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇంతకాలం బ్యాంక్కు బ్యాంక్కు మధ్య ఈ మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో వ్యత్యాసాలు ఉండేవి. వాటిని లేకుండా చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే ఇంతకాలం మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు ఫైన్ వేసేవరకు కూడా.. ఆ విషయం మనకు గుర్తుకు రాదు. అంతేకాకుండా అసలు దీనిని ఎలా కౌంట్ చేస్తారో చాలా మందికి తెలీదు. బ్యాంక్ వాళ్లు ఫైన్ వేసే పద్దతి? కూడా తెలీదు.
ఆర్బీఐ కొత్త రూల్..
ఈ మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ తెచ్చిన రూల్ ప్రకారం.. అర్బన్, సెమి అర్బన్, రూరల్ ఏరియాలను బట్టి మినిమమ్ బ్యాలెన్స్ మారుతుంది. బ్యాంక్ ఏదైనా.. ఈ మినిమమ్ బ్యాలెన్స్లో మార్పు రాదు. తద్వారా కొత్త ఖాతాలు తీసుకున్నా వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడకుండా ఉంటుంది. అర్బన్ ఏరియాల్లో రూ.3వేలు, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.1500గా ఈ మినిమమ్ బ్యాలెన్స్ను ఆర్బీఐ ఫైనల్ చేసింది. ఇది సేవింగ్స్ ఖాతాలకు. అయితే కరెంట్ అకౌంట్స్కు ఆ ఖాతా టైర్, బిజినెస్ ప్రొఫైల్ను బట్టి రూ.12000 నుంచి రూ.30వేల వరకు ఉంటుంది.
కొత్త రూల్స్ ఎందుకు ?
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ బ్యాంకింగ్ సలహాదారు నీరజ్ శర్మ్ పేర్కొన్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయి, ఏళ్ల తరబడి సేకరించిన ఫీ్ బ్యాక్, అభిప్రాయాల ప్రకారం కనీస బ్యాలెన్స్ అవసరాలను సవరించాలనే నిర్ణయానికి ఆర్బీఐ వచ్చింది.
ఫిజికల్ బ్రాంచ్లు, నగదు నిర్వహణ, కస్టమర్ సేవా సదుపాయాలను నిర్వహించడం చాలా ఖరీదైన అంశాలుగా మారాయి. ద్రవ్యోల్బణం ఖర్చులను పెంచుతుంది. బ్యాంకుల అంతటా కనీస బ్యాలెన్స్ అవసరాలలో అసమానతలు తరచుగా గందరగోళానికి దారితీస్తున్నాయి. ఈ విషయంలో RBI జోక్యం ఇప్పుడు స్పష్టత, పారదర్శకతను తెస్తుందని నీరజ్ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలపై దృష్టి కేంద్రీకరించబడింది, ఇక్కడ కస్టమర్లు సమర్థవంతంగా నిధులను నిర్వహించవచ్చు, జరిమానాలను తగ్గించవచ్చు.” పరిమితులను ప్రామాణీకరించడం ద్వారా, తగ్గింపులపై వివాదాలను తగ్గించడం, బ్యాంకులు తమ బాధ్యతల గురించి కస్టమర్లతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి ప్రోత్సహించడం RBI లక్ష్యంగా పెట్టుకుంది’’ అని అధికారులు చెప్తున్నారు.
సేవింగ్స్ ఖాతాదారులకు కొత్త భారాలు
బ్యాంక్ ఖాతాదారులకు RBI నూతన ప్రమాణీకరణ నిబంధనలు భారమవుతున్నాయి. ప్రత్యేకంగా తక్కువ లావాదేవీలు ఉన్న సేవింగ్స్ ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ నిర్దేశిత స్థాయికి దిగువకు చేరితే, ఖాతా రకం ఆధారంగా నెలకు ₹100 నుండి ₹500 వరకు జరిమానా విధించబడనుంది. ఇప్పటివరకు బ్యాంకుల మధ్య నిబంధనల్లో ఉన్న తేడాల వల్ల ఫీజులను తప్పించుకునే అవకాశం ఉండగా, తాజా మార్పులతో ఆ అవకాశాలు లేకపోయాయి.
రూరల్ కుటుంబాలు, విద్యార్థులు, సీనియర్ పౌరులు వంటి తక్కువ బ్యాలెన్స్పై ఆధారపడే వర్గాలకు ఈ ప్రభావం మరింతగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
RBI ప్రకారం, డిజిటల్ బ్యాంకింగ్ టూల్స్ ఈ ప్రభావాన్ని తగ్గించగలవు. మొబైల్ యాప్లలో అందుబాటులో ఉన్న లో-బ్యాలెన్స్ అలర్ట్లు, సగటు బ్యాలెన్స్ ట్రాకర్లు వంటి ఫీచర్లు ఖాతాదారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకునేందుకు సహాయపడతాయి. నిపుణులు బహుళ ఖాతాలను ఒకటిగా మార్చడం, ఆటోమేటెడ్ చెల్లింపుల నోటిఫికేషన్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు సూచిస్తున్నారు.
కరెంట్ ఖాతాదారులకు మరింత ఒత్తిడి
కరెంట్ అకౌంట్ల విషయంలో జరిమానా భారం మరింత అధికం కానుంది. చిన్న వ్యాపారాలు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందువారికి ఖాతా స్థాయి ఆధారంగా నెలకు ₹1,000 వరకు పెనాల్టీలు విధించబడవచ్చు. నగదు ప్రవాహం తక్కువగా ఉండే వ్యాపారాలు తమ నిధుల వినియోగాన్ని, రోజువారీ లిక్విడిటీ నిర్వహణను మళ్లీ సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్యాష్ లావాదేవీలపై ఆధారపడే ప్రాంతాల్లో ఈ మార్పులు మరింత సవాళ్లు సృష్టిస్తాయని నిపుణుల అంచనా. దీనికి ప్రత్యామ్నాయంగా కొన్ని బ్యాంకులు తక్కువ ఇన్-బ్రాంచ్ సేవలతో కూడిన, తక్కువ కనిష్ట బ్యాలెన్స్ అవసరం ఉన్న ఖాతాలను ప్రవేశపెట్టాయి. అయితే నిపుణులు హెచ్చరిస్తూ—సాధారణ నిర్లక్ష్యం కూడా నెలల తరబడి జరిమానాల రూపంలో భారీ భారం కావచ్చని చెబుతున్నారు.
మినిమమ్ బ్యాలెన్స్ ఎలా కౌంట్ చేస్తారు
మినిమమ్ బ్యాలెన్స్ లెక్కించడానికి బ్యాంకులు రెండు పద్దతులను అనుసరిస్తాయి. వాటిలో ఒకటి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్(MAB), మరొకటి త్రైమాసిక యావరేజ్ బ్యాలెన్స్(QAB). ఖాతాలో యావరేజ్ బ్యాలెన్స్ నిర్దేశిత పరిమితికన్నా తక్కువగా ఉన్న సమయాల్లో తక్కువగా ఉన్న కారణంగా జరిమానా విధిస్తారు. సగటు బ్యాలెన్స్ నిర్దేశిత ప్రమాణానికి దిగువన ఉంటే, ఖాతా రకం ఆధారంగా పెనాల్టీలు వర్తిస్తాయి. కొన్ని బ్యాంకులు త్రైమాసికంగా లెక్కించే Quarterly Average Balance (QAB) విధానాన్ని కూడా అనుసరిస్తాయి. ఇది ముఖ్యంగా కరెంట్ అకౌంట్లకు వర్తిస్తుంది.
MAB విధానం..
చాలా బ్యాంకులు ఈ పద్దతినే అనుసరిస్తాయి. దీనిని నెలలో ప్రతి రోజు రాత్రి 12 గంటలకన్నా ముందే మీ ఖాతాలో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ను బ్యాంక్ నమోదు చేస్తుంది. అలా ప్రతి రోజూ నమోదు చేసిన బ్యాలెన్స్లను కలుపుతుంది. ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని నెలలోని మొత్తం రోజుల సంఖ్యతో భాగిస్తుంది. అప్పుడు వచ్చిన మొత్తం మినిమమ్ బ్యాలెన్స్ మొత్తానికి తక్కువగా ఉంటే అప్పుడు ఫైన్ విధిస్తుంది.
సూత్రం: MAB = (రోజువారి క్లోజింగ్ బ్యాలెన్స్ల మొత్తం) ÷ (నెలలోని రోజుల సంఖ్య)
ఉదాహరణ:
రోజులు బ్యాలెన్స్ (₹)
1–10 5,000
11–20 2,000
21–30 0
మొత్తం = (10×5000) + (10×2000) + (10×0)
= 50,000 + 20,000 + 0 = 70,000
MAB = 70,000 ÷ 30 = ₹2,333
బ్యాంక్ కోరే MAB = ₹3,000 అయినప్పుడు → జరిమానా పడుతుంది.
త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (QAB) పద్దతి
ఈ పద్దతి కూడా నెలవారీ యావరేజ్ బ్యాలెన్స్(MAB) పద్దతినే అనుసరిస్తుంది. కానీ ఇది ప్రతి నెలా కాకుండా మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తుంది. ఇది సాధారణంగా కరెంట్ అకౌంట్స్ లేదా ప్రీమియం సేవింగ్స్ అకౌంట్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.
సూత్రం: QAB = (రోజువారి క్లోజింగ్ బ్యాలెన్స్ల మొత్తం) ÷ (నెలలోని రోజుల సంఖ్య)
ఉదాహరణ:
రోజులు బ్యాలెన్స్ (₹)
1–10 5,000
11–20 2,000
21–30 0
మొత్తం = (10×5000) + (10×2000) + (10×0)
= 50,000 + 20,000 + 0 = 70,000
QAB = 70,000 ÷ 30 = ₹2,333 ప్రతి నెలా ఇలానే కొనసాగితే మూడు నెలలకు రూ.6999
బ్యాంక్ కోరే QAB = ₹7000 అయినప్పుడు → జరిమానా పడుతుంది.
రోజువారీ మినిమమ్ బ్యాలెన్స్ (MDB)
ఈ పద్దతిని ప్రస్తుతం చాలా తక్కువ మంది వినియోగిస్తు్నారు. ఈ విధానంలో నెలలో ఏదైనా ఒక్క రోజు బ్యాలెన్స్ అవసరమైన స్థాయికి వక్కువగా వస్తే జరిమానా పడుతుంది.
ఉదాహరణ:
అవసరమైన కనిష్ట బ్యాలెన్స్ = ₹2,000
ఒకరోజు బ్యాలెన్స్ ₹1,500కి తగ్గితే → జరిమానా పడుతుంది.
బ్యాంక్ ఎలా ట్రాక్ చేస్తుంది?
ప్రతిరోజూ క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు అవుతుంది. నెల చివరలో లేదా త్రైమాసికం చివరలో సిస్టమ్ స్వయంచాలకంగా సగటును లెక్కిస్తుంది. అవసరమైన సగటు చేరకపోతే → జరిమానా విధిస్తారు. చాలా మొబైల్ యాప్లు MAB లేదా అలర్ట్లు చూపిస్తాయి.
ఫైన్లో వ్యత్యాసాలు ఎందుకు?
అయితే మినిబ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఖాతాదారుకు విధించే ఫైన్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒక నెల విధించిన ఫైన్ను మరో నెల విధించదు. ఆ మార్పుకు కారణం.. మినిమమ్ బ్యాలెన్స్కు ఎంత తక్కువగా ఉంది అన్నదానిని ప్రమాణంగా తీసుకుని ఫైన్ విధించడం జరుగుతుంది. ఇది బ్యాంకుకు బ్యాంకుకు మారే అవకాశాలు ఉన్నాయి.
ఉదాహరణకు మీ ఖాతాలో రూ.10వేల మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి. కానీ రూ.8000వేలు మాత్రమే ఉన్నాయి. అంటే మినిమమ్ బ్యాలెన్స్కు రూ.2000 తక్కువ ఉన్నాయి. ఈ సందర్భంలో ఎంత తక్కువ ఉందో అంత మొత్తంలో 5శాతం ఫైన్ విధిస్తుంది. అంటే రూ.2000లో 5శాతం రూ.100 ఫైన్ను విధిస్తుంది. అయితే అన్ని బ్యాంకులు ఇదే పద్దతిని అనుసరిస్తాయని కాదు.. కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ ఫైన్ను విధిస్తాయి. ఇంతకాలం మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అన్న దానిపై కూడా నిర్దేశిత రూల్స్ లేవు. దాంతో బ్యాంకులు తమ పద్దతిలో మినిమమ్ బ్యాలెన్స్ నియమాలను పెట్టేవి. కాగా తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(MAB) మినిమమ్ బ్యాలెన్స్ల విషయంలో కొత్త రూల్ను తీసుకొచ్చింది. దాని ప్రకారం అన్ని బ్యాంకులు నిర్దేశిత మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

