
తెలంగాణలో పోలీసుల కొత్త రూల్స్.. క్లారిటీ ఇచ్చిన సజ్జనార్
వాట్సాప్, ఫోన్ కాల్స్ను రికార్డ్ చేస్తామని పోలీసులు ప్రకటించినట్లు వైరల్ అవుతున్న పోస్టర్.
తెలంగాణలో పోలీసులు కొత్త రూల్స్ను అమలు చేయనున్నారంటూ ఓ పోస్టర్తో సోషల్ మీడియాతో తెగ వైరల్ అయింది. దాని ప్రకారం ఇకపై వాట్సాప్, ఫేస్బుక్ కాల్స్ను పోలీసులు రికార్డ్ చేస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ఫార్మ్లలో మనం పెట్టే ప్రతి మెసేజ్ను వారు పర్యవేక్షిస్తుంటారు. ఈ మేరకు ప్రకటిస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓప్రకటన విడుదల చేసినట్లు ఉన్న పోస్టర్ను షేర్ చేశారు. ఇది పలు సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. దానిని ఎవరూ నమ్మొద్దని చెప్పారు. అదంతా తప్పుడు ప్రచారమని, అదొక నకిటీ పోస్టర్ అని హైదరాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు. తాము ఎటువంటి పోస్టర్ను రిలీజ్ చేయలేదని, అటువంటి నిబంధనలను అమలూ చేయట్లేదని హైదరాబాద్ పోలీసులు వివరించారు. ఈ మేరకు వాళ్లు ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘తప్పుడు సమాచారంతో డిజిటల్ పోస్టర్ ఒకటి సోసల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అందులోని సమాచారం పూర్తిగా అవాస్తవం, పోలీసులు దాన్ని రిలీజ్ చేయలేదు. అటువంటి కంటెంట్ను ఎవరూ కూడా ధ్రువీకరించుకోకుండా షేర్ చేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ చేయవద్దు’’ అని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇదే పోస్ట్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా షేర్ చేసుకున్నారు. అయితే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంతకీ పోస్టర్లో ఏముందంటే..
"రేపటి నుండి కొత్త WhatsApp మరియు ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడుతున్నాయి"
1. అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి.
2. అన్ని కాల్ రికార్డులు సేవ్ చేయబడతాయి.
3. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియాలు పర్యవేక్షించబడతాయి.
4. ఈ సమాచారం లేని వారికి తెలియజేయండి.
5. మీ పరికరం మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడుతుంది.
6. ఎవరికి తప్పుడు సందేశం పంపకుండా జాగ్రత్త వహించండి... ఇదే విధంగా మరిన్ని అంశాలను కూడా పోస్టర్లో తెలిపారు. అవన్నీ అవాస్తవాలేనని పోలీసులు స్పష్టం చేశారు.

