హైడ్రా సిఫారసు: GHMC, HMDA అధికారులపై కేసులు
x

హైడ్రా సిఫారసు: GHMC, HMDA అధికారులపై కేసులు

అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు సరే, ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతేంటి? వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోదా?


హైదారాబాద్ లో చెరువులు, నాలాలు, పార్కులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ కట్టడం అని తెలిస్తే నోటీసులు కూడా లేకుండానే కూల్చి పారేస్తోంది. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు సరే, ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతేంటి? వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో చెరువుల్లో కట్టడాలకి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

సైబరాబాద్ EOW (ఎకనామిక్ అఫెన్స్ వింగ్) లో కమిషనర్ అవినాష్ మహంతి కేసులను నమోదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుదాన్షు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ - మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి.

క్రిమినల్ కేసులు ఎందుకంటే..?

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్ర కుంట సరస్సు బఫర్ జోన్‌లో ఈ నెల ప్రారంభంలో, హైడ్రా అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను, ఒక్కొక్కటి గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తులను కూల్చివేసింది. చందానగర్, ప్రగతినగర్‌లోని ఎర్ర కుంట సరస్సు చుట్టూ ఉన్న ఈ అక్రమ కట్టడాలను అధికారులు నేలమట్టం చేశారు.

సరస్సు బఫర్ జోన్‌లో అక్రమంగా భవనాలను నిర్మించడంతోపాటు పర్యావరణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారనే నేపథ్యంలో హైడ్రా ఆ నిర్మాణాలను కూల్చివేసింది. ఇప్పుడు వీటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 0.29 ఎకరాల ఆక్రమణలో ఉన్న భూమిలో అనధికార నిర్మాణాలను నిర్మించేందుకు ఈ అధికారులు అనుమతించారని, సరస్సు పర్యావరణ సమగ్రతను దెబ్బతీశారని హైడ్రా జరిపిన సర్వేలో వెల్లడైంది. దీంతో అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై హైడ్రా కమిషనర్ సిఫారసు మేరకు సైబరాబాద్ కమిషనర్ కేసులు నమోదు చేశారు.

Read More
Next Story