
హైడ్రా తొలగిస్తున్న ప్యాట్నీ నాలా ఆక్రమణలు
నాలాల విస్తరణకు హైడ్రా శ్రీకారం, వరద ముప్పు తొలగేనా?
హైదరాబాద్ నగరంలో ఈ వర్షాకాలంలో వరద ముప్పు తొలగించేందుకు హైడ్రా శ్రీకారం చుట్టింది. ఆక్రమణలను తొలగించి నాలాలను విస్తరిస్తోంది.
హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు నాలాలు పొంగి పొర్లుతూ వరదనీరు జనవాసాలను ముంచెత్తుతుంటోంది. వర్షపు నీరు పోయేందుకు నిర్మించిన నాలాలను కొందరు కబ్జాదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో నాలాలు కుచించుకు పోయి వర్షపు నీరు పోయే మార్గం లేక వర్షమొస్తే చాలు వరదముప్పుతో నగర జనం సతమతం అవుతున్నారు.
- ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) హైదరాబాద్ నగరంలో నాలాల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఆక్రమణల పాలైన నాలాల్లో ఉన్న అక్రమ భవనాలను కూల్చివేసి వర్షపునీరు వెళ్లేందుకు వీలుగా నాలాలను విస్తరిస్తోంది.
- మొన్నటి దాకా చెరువుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా ప్రస్థుతం వర్షాకాలం నేపథ్యంలో ఆ చెరువులను సుందరీకరించి వర్షపునీటిని నిల్వ చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు కార్యక్రమాలను హైడ్రా చేస్తుంది.
నాలాల విస్తరణకు హైడ్రా ప్రాధాన్యం
హైదరాబాద్ నగరంలో నాలాల విస్తరణకు హైడ్రా ప్రాధాన్యం ఇస్తోంది.సికింద్రాబాద్ నగరంలోని ప్యాట్నీ నాలా ఆక్రమణలను తొలగించిన హైడ్రా దాన్ని విస్తరించింది. ప్యాట్నీ సెంటరులో నాలాపై నిర్మించిన వాణిజ్య కట్టడాలను జేసీబీలతో తొలగించింది. 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన ప్యాట్నీ నాలా కబ్జాలతో 15 నుంచి 18 అడుగులకు పరిమితమైంది. దీనిపై హైడ్రా చర్యలు తీసుకుంది.
ప్రజల ఫిర్యాదులపై హైడ్రా సత్వర చర్యలు
ప్రజల ఫిర్యాదులపై హైడ్రా సత్వర చర్యలు తీసుకుంటోంది. ప్యాట్నీ నాలా ఆక్రమణకు గురి అవ్వడంతో పాయిగ కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్,ప్యాట్నీ కాలనీ, విమాన నగర్, బీహెచ్ఈఎల్ కాలనీ, ఇందిరమ్మ నగర్ నీట మునుగుతున్నట్టు హైడ్రాకు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. గతంలో కంటోన్మెంట్ అధికారులకు కూడా ఆక్రమణలు తొలగించాలని ముంపు ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులను కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి, ఆక్రమణలను తొలగించారు.నాలా ఆక్రమణలతో వేలాది నివాసాలు నీట మునిగిన పాత చిత్రాలను ప్రజలు అధికారులకు చూపించారు.
కుచించుకు పోయిన నాలాలు
నగరంలో పలు నాలాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని కుచించుకు పోయాయి. నాలా 70 అడుగులకు పైగా ఉండగా 60 అడుగుల మేర ఆక్రమణలు గురి అయినట్టు అధికారులు నిర్ధారించారు. భవిష్యత్ లో నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులు నిర్ణయించి నాలాకు ఇరువైపులా ప్రహరీలు నిర్మించాలని కంటోన్మెంటు అధికారులు నిర్ణయించారు. నాలాల ఆక్రమణలను కూల్చివేయడంతో అయిదు కాలనీల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
తీరిన కాలనీల ముంపు సమస్య
20 నుంచి 30 ఏళ్లుగా నీట మునుగుతున్న కాలనీల ఇబ్బందులు కూల్చివేతలతో తొలిగాయి. వర్షం కురిస్తే ఎక్కడ తమ నివాసాలు నీట మునుగుతాయో అనే ఆందోళనకు హైడ్రా అధికారులు తెర దించారు. హస్మత్ పేట చెరువు వరద నీటిని తెచ్చే హస్మత్ పేట నాలా, మహేంద్ర హిల్స్ పై భాగం నుంచి వరద నీటిని తెచ్చే పికెట్ నాలా 23 కిలోమీటర్ల మేర ప్రయాణించి ప్యాట్నీ పరిసరాల్లో కలిసిన చోట 15 నుంచి 18 అడుగులకు పరిమితం అవ్వడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాట్నీ, రసూల్ పురా, చికోటి గార్డెన్స్ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల పర్యటించి ఆక్రమణలను తొలగించారు.
శాటిలైట్ చిత్రాలు చూసి కూల్చివేతలు
హైదరాబాద్ నగరంలో నాలాల పరిస్థితిపై కిర్లోస్కర్ కమిటీ, వోయంట్స్ కమిటీ నివేదికలతో పాటు, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ ఎస్ సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. నాలాల ఆక్రమణలతో వరద నీరు అపార్ట్మెంట్లను సైతం ముంచెత్తుతోంది. చికోటీ గార్డెన్స్లో మొత్తం కాలువ పూడుకుపోవడంతో వరదనీరు సాఫీగా వెళ్లని తీరును స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. 5 సెంటీమీటర్ల మేర వర్షం పడినప్పడు తమ అపార్టుమెంట్లు, ఇళ్లు ఎలా నీట మునిగాయో సెల్ఫోన్లలో ఫొటోలను, వార్తలను చూపించి కబ్జాలను తొలగించాలని కోరారు. అప్పటికప్పుడే జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, హైడ్రా అధికారులతో కమిషనర్ చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story