
‘నిరూపిస్తే రాజీనామా చేస్తా’.. సీఎంకు హరీష్ రావు ఛాలెంజ్
బీఆర్ఎస్ హయాంలో టన్నెల్ పనులు చాలా వేగంగా జరిగాయని, 20కిలోమీటర్ల వరకు సొరంగం పనులు పూర్తయ్యాయని హరీష్ తెలిపారు.
అబద్ధాలు చెప్పడం అనేది కాంగ్రెస్కు, సీఎం రేవంత్కు వెన్నతోపెట్టిన విద్య అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ నోరు విప్పితే అబ్ధాలే చెప్తున్నారని, కేసీఆర్, బీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆఖరికి తమ ప్రభుత్వం చేసిన పనులను కూడా చేయలేదంటూ అబద్ధాలాడుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్లో తమ ప్రభుత్వం అంగుళం సొరంగం కూడా తవ్వలే రేవంత్ చేస్తున్న ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో సొరంగం పనులను ఎక్కడేసిన గొంగలి అక్కడలా ఉన్నాయని అంటున్నారని, కానీ తమ పాలనలోనే అన్ని ప్రభుత్వ ప్రాజెక్ట్లు పరుగులు పెట్టాయని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరగలేదని కాంగ్రెస్ నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. అదే విధంగా నిరూపించలేకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో టన్నెల్ పరుగులు చాలా వేగంగా జరిగాయని, 20కిలోమీటర్ల వరకు సొరంగం పనులు పూర్తయ్యాయని, అందుకోసం రూ.3వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు హరీష్ రావు. ఈ అంశంపై చర్చకు కూడా తాము సిద్ధమని, కానీ చర్చ పెట్టే దమ్ము రేవంత్కు ఉందా? అని ప్రశ్నించారు.
అంతేకాకుండా తన దుబాయ్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడాన్ని కూడా హరీష్ రావు తప్పుబట్టారు. దుబాయ్లో తాను ఎంజాయ్ చేయడానికి వెళ్లలేదని, ఫ్రెండ్ కూతురు పెళ్లి జరుగుతుంటే ఆ వేడుకకు హాజరవడానికి వెళ్లానని చెప్పారు హరీష్. అంతేకాకుండా తాను దుబాయ్కి వెళ్లింది ఫిబ్రవరి 21న అని, ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది ఫిబ్రవరి 22న అని గుర్తు చేశారు. కానీ కావాలనే తన దుబాయ్.. విజిట్ను రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.