
జైల్లో వేస్తే విశ్రాంతి తీసుకుంటా..
ఏసీబీ విచారణ అనంతరం మరోసారి అరెస్ట్పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఈరోజు ఏసీబీ ముందు హాజరైన కేటీఆర్ను 8 గంటల పాటు అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ సెల్ఫోన్ను అధికారులు సీజ్ చేసే ప్రయత్నం చేశారు. కాగా ఈరోజు తాను విచారణకు ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. దీంతో ఈ-రేస్ జరిగిన సమయంలో వాడిన సెల్ఫోన్లను అప్పగించాలని చెప్పారు అధికారుల. ఈ నెల 18లోపు సెల్ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ కార్ రేసింగ్పై అసెంబ్లీలో చర్చిద్దామంటే.. రేవంత్ పారిపోయారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పినా పత్తాలేరు. ఏసీబీ విచారణలో అధికారులు ఉదయం నుంచీ ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారు. అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులనే అడిగాను. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగింది. రేవంత్ జైలుకెళ్లారు.. మమ్మల్నీ జైల్లోపెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా. వందల కొద్దీ కేసులు పెట్టినా.. జైల్లో పెట్టినా భయపడను’’అని అన్నారు.