గండిపేట చెరువు తీరంలో గుట్టుగా అక్రమ కన్వెన్షన్ల నిర్మాణం
x
గండిపేట తీరంలో అక్రమంగా కన్వెన్షన్ కేంద్రం నిర్మాణం

గండిపేట చెరువు తీరంలో గుట్టుగా అక్రమ కన్వెన్షన్ల నిర్మాణం

గండిపేట చెరువు తీరం నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో జన్వాడ గ్రామం పరిధిలో అక్రమంగా పలు కన్వెన్షన్ కేంద్రాలు వెలిశాయి.


హైదరాబాద్ నగర శివార్లలో మంచినీటి సరస్సులు, చెరువులకు బఫర్ జోన్లలో ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్ట రాదని నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి అక్రమంగా కన్వెన్షన్ల నిర్మాణం జరిగింది. శంక‌ర్‌పల్లి మండ‌లం జన్వాడ గ్రామంలో గండిపేట చెరువును ఆనుకొని పెద్ద ఎత్తున క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ల నిర్మాణ‌ం జ‌రిగింది.ఈ కన్వెన్షన్ కేంద్రాల్లో కొన్ని సంవ‌త్స‌ర‌ం క్రితం పూర్తి కాగా మరి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలు గండిపేట నీటి అంచునుంచి 500 మీట‌ర్ల దూరంలో ఉన్నాయి. జలాశయాల చెంత ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టరాదని జీఓఎంఎస్ నంబరు 111 లో చెపుతున్నా,నిబంధనకు విరుద్ధంగా కన్వెన్షన్ల నిర్మించారు.




నార్సింగి మున్సిపాలిటీలో గ్రామాల విలీనం

జ‌న్వాడ గ్రామ‌పంచాయితీ ఒక సంవ‌త్స‌ర‌ం క్రిత‌ం నార్సింగి మున్సిపాలిటీలో క‌లిసిపోయింది. కొత్త‌గా నిర్మిస్తున్న ఈ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లు గ్రామ పంచాయితీల నుంచి ఏమైనా ప‌ర్మిష‌న్లు తీసుకున్నాయా అని విచారించ‌గా అందుకు వారు గ్రామ పంచాయితీ వ‌ద్ద‌కు ఏ క‌న్వెన్ష‌న్ సెంటరు వారు అనుమతి కోసం రాలేదని సమాధానం వచ్చింది. తాము ఎవ‌రికీ ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌లేద‌ని జన్వాడ గ్రామ పంచాయతీ అధికారులు చెప్పారు.



ఆస్తి పన్ను వసూలేది?

త‌రువాత నార్సింగి మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ను స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం ద్వారా స‌మాచారం అడుగ‌గా ఈ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లు చాలా కాలం క్రిత‌ం నిర్మాణ‌ం అయ్యాయని, జ‌న్వాడ గ్రామ పంచాయితీ వారు వాటికి సంబంధించిన ద‌స్తాలు తమకు ఇవ్వ‌లేద‌ని పొంత‌న లేని జ‌వాబు ఇచ్చారు. ఇక్కట గ‌మ‌నించ‌వ‌ల‌సిన విష‌యం ఏమిటంటే చాలా కాలం క్రింద నిర్మాణం జ‌రిగిన, మ‌రి వాటికి ఇంటి నంబ‌ర్లు ఇవ్వ‌లేదు.కన్వెన్షన్ సెంటర్లకు ఆస్తి ప‌న్ను ఏమీ ఇంత‌వ‌ర‌కు క‌ట్ట‌లేదు.అంటే కన్వెన్షన్ సెంటర్లు ఆస్తిపన్నును ఎగవేశారని చెప్పవచ్చు.



గండిపేట చెరువు సమీపంలో నియో కన్వెన్షన్, ఆర్యా కన్వెన్షన్, కె కన్వెన్షన్ నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదు. జన్వాడ గ్రామంలో తమ నార్సింగి మున్సిపాలిటీలో విలీనం అయ్యాక కన్వెన్షన్ కేంద్రాల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు గ్రామపంచాయతీ ఇవ్వలేదని తేలింది. కన్వెన్షన్ల నిర్మాణానికి అనుమతి ఉన్నట్లు జన్వాడ గ్రామ పంచాయతీ తమకు ఎలాంటి రికార్డులు సమర్పించలేదని నార్సింగి మున్సిపల్ కమిషనర్ ఆర్టీఐ కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు సమాచారం ఇచ్చారు.




ఒక్క క‌న్వెన్ష‌న్ సెంట‌రు వేయి మంది కూర్చొనేలా గండిపేట చెరువును ఆనుకొని పుట్ట‌గొడుగుల్లాగా పుట్టుకు వ‌స్తున్నా, సంబంధిత అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గురువారం తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. గండిపేట తీరాన అక్రమంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ల సెంటర్ల విష‌యంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి త‌గిన చ‌ర్య‌లు తీసుకోనాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ముఖ్య‌మంత్రిని కోరారు. ఈ మేరకు గురువారం సీఎంకు లేఖ రాశారు.



Read More
Next Story