
స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఖాయమేనా ?
క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల ప్రకారమైతే బీసీలకు అధికారికంగా 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యంకాదు.
తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలు జరగటం ఖాయమని తేలిపోయింది. అనధికారిక సమాచారం ప్రకారం జూలైలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు ఎలాగూ పార్టీరహితంగానే జరగుతాయి. మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే పార్టీ బ్యానర్ పైన జరుగుతాయి. ఇపుడు విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్(BC Reservations) అంశమే రాజకీయపార్టీల మధ్య హాట్ టాపిక్ గా ఉంది. క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల ప్రకారమైతే బీసీలకు అధికారికంగా 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యంకాదు. ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ 23 శాతం మాత్రమే. ఒకవేళ రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ప్రయత్నిస్తే కోర్టులు అడ్డుకోవటం ఖాయం. అందుకనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో చేర్చాలని గట్టిగా అడిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అడిగినట్లుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తు 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు నరేంద్రమోడి(Narendra Modi) ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించేందుకు లేదు. కారణం ఏమిటంటే రాజకీయ వైరుధ్యాలే అని అందరికీ తెలుసు. రాజకీయ కారణాల వల్ల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అసాధ్యమైనపుడు మరి పరిష్కారం ఏమిటి ? పరిష్కారం ఏమిటంటే పార్టీపరంగా రిజర్వేషన్లు అమలుచేయటమే. అవును, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) స్ధానికసంస్ధల ఎన్నికల్లో మెజారిటి సీట్లు బీసీలకే కేటాయించారు. ఓసీ సీట్లను కూడా అప్పట్లో జగన్ బీసీలకే కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.
అదేపద్దతిలో రేవంత్ కూడా పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 23 శాతం రిజర్వుడు స్ధానాలుపోను మిగిలిన స్ధానాలన్నీ ఓసీ సీట్లే. ఇలాంటి ఓసీ సీట్లలో వీలైనన్ని బీసీలకు కేటాయించాలని రేవంత్ డిసైడ్ అయినట్లు తెలిసింది. స్ధానికసంస్ధల్లో 23 శాతాన్ని 42 శాతానికి పెంచాలంటే పార్టీపరంగా పెంచటం ఒకటే రేవంత్ ముందున్న ఏకైక మార్గం. దీంతో 23 శాతం అధికారికం అయితే మిగిలిన 19 శాతం అనధికారికం అవుతుంది. అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసినట్లు పార్టీ చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కాలం సానుకూలమైనపుడు 42 శాతం రిజర్వేషన్లు అధికారికం అవుతాయేమో చూడాలి.
ప్రతిపక్షాలకు సమస్యేనా ?
పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయటం అంటే ప్రతిపక్షాలను ఇబ్బందుల్లోకి నెట్టేయటమే అవుతుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించినపుడు బీఆర్ఎస్, బీజేపీలు ఏమిచేస్తాయి అన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. బీసీ సంఘాలు ఇదేవిషయమై ప్రతిపక్షాలను నిలదీయటం ఖాయం. కాబట్టి వేరేదారిలేక బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు కూడా పార్టీలపరంగా బీసీ రిజర్వేషన్ను పెంచాల్సిందే. అధికారంలో ఉన్నపుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదు. బీజేపీ నేతలు కూడా ఈవిషయాన్ని లైట్ తీసుకున్నారు. మొదటిసారిగా 2023 ఎన్నికల్లో కామారెడ్డి సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ ఇచ్చిన హామీతోనే అంశం బాగా హైలైట్ అయ్యింది. అప్పటినుండి ఈఅంశం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలంటే బీఆర్ఎస్ కు అంత పెద్దసంఖ్యలో బీసీనేతలు దొరకటం అంత ఈజీకాదు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంటు ఎన్నికల్లో బోర్లాపడిన తర్వాత చాలామంది నేతలు, క్యాడర్ స్తబ్దుగా ఉన్నారు. పైగా ఈమధ్య కల్వకుంట్ల ఫ్యామిలీలో జరుగుతున్న అంత: కలహాలతో పార్టీలో పెద్ద గందరగోళం పెరిగిపోతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, ఏసీబీ విచారణలకు హాజరవ్వటంతో వీళ్ళ భవిష్యత్తుపై పార్టీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది.
ఇక బీజేపీ విషయం చూస్తే ఈపార్టీకి 42 శాతం రిజర్వేషన్ పెద్ద సమస్యనే చెప్పాలి. ప్రజల్లో భావోద్వేగాల ఆధారంగా మాత్రమే బీజేపీ ఎన్నికల్లో సీట్లు గెలుస్తోంది కాని సంస్ధాగతంగా బలముండికాదు. 119 అసెంబ్లీ ఎన్నికల్లోనే పార్టీకి గట్టి అభ్యర్ధుల కొరత తీవ్రంగా పట్టిపీడిస్తున్నపుడు ఇక మండలస్ధాయిలో వందలమంది నేతలు ఎక్కుడ దొరుకుతారు. కాబట్టి పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయటం అన్నది కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చే అంశమనే చెప్పాలి. అధికారంలో ఉండటం హస్తంపార్టీకి పెద్ద ప్లస్ పాయింట్. మరి ఈవిషయంలో మిగిలిన పార్టీలు ఏమిచేస్తాయో చూడాల్సిందే.