బీఆర్‌ఎస్ మళ్లీ సకలజన ఉద్యమ బాట పట్టగలదా?
x

బీఆర్‌ఎస్ మళ్లీ సకలజన ఉద్యమ బాట పట్టగలదా?


‘జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎవరూ తమ మూలాలను మర్చిపోకూడదు’ ఇది ఎందరో మహానుభావులు, మేధావులు చెప్పిన మాట. మన మూలాలే మనల్ని ఎప్పుడూ కాపాడతాయని చెప్తుంటారు. ఇది ఒక వ్యక్తికే కాదు వ్యవస్థకు కూడా వర్తిస్తుందని చెప్తారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మాత్రం దీనిని పూర్తిగా మర్చిపోయింది. ఈ సామెతనే కాదు వారి మూలాలను కూడా. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఉన్నంత కాలం ఆ పార్టీలో, పార్టీ నేతల్లో ఉద్యమ జ్వాల ఎప్పుడూ రగుల్తూనే ఉండేది. ప్రజలకు సమస్య ఉందని తెలియడం ఆలస్యం కొట్లాడి దానిని పరిష్కరించాలన్న తెగువ, తెంపరితనం వారిలో కనిపించేది. కానీ ఇప్పుడు అందంతా ఎటుపోయిందో కూడా తెలియట్లేదు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించినప్పటి నుంచి పార్టీ చప్పబడిపోయింది. ఉద్యమం చేసేటోళ్లం, చేసినోళ్లం అని చెప్పుకోవడమే తప్ప ఉద్యమబాట పట్టడాన్ని పూర్తిగా మరిచారు. మాటలు, విమర్శలు, తిట్లతోనే పబ్బం గడుతుపుతున్నారు.

రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏమైందో ఏమో కానీ ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య దూరం పెరిగింది. ఈ మార్పు ప్రభావం 2023 ఎన్నికల్లో కనిపించింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య దూరం మరింత పెరిగింది. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు కూడా తమ ఉద్యమ స్ఫూర్తిని పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. అధికారం పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో పెద్దగా కనిపించడం లేదు. వారి అధినేత కేసీఆర్ అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ కూడా నేతల్లో చల్లారిపోయిన ఉద్యమ స్ఫూర్తిని తిరిగి జ్వలింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఏకాడికి అధికార పార్టీ నేతలపైన మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపైన ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూనే పబ్బం గుడుపుతున్నట్లే కనిపిస్తోంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నానారకాల పేర్లు పెట్టారు. కించపరిచేలా మాట్లాడారు. సీఎంను పట్టుకుని ‘పిచ్చి కుక్క, జోకర్ సీఎం, చిట్టినాయుడు, జానెడు సీఎం, బుడ్డోడు, బ్యాగ్ మ్యాన్’ ఇలా నానా రకాలుగా అవమానించారు. అయితే ఇలా చేయడం ద్వారా కేటీఆర్ ఏం సాధించగలరు? అంటే ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ‘రైతుల సమస్యలు, వ్యవసాయ రంగం తిరోగమనం, పల్లె ప్రగతి-గ్రామీణ అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్లు, నీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఆంధ్రప్రదేశ్ దోచుకెళ్తున్న తెలంగాణ నీరు’ ఇలా మరెన్నో సమస్యలను బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఏ ఒక్కదాని పరిష్కారం కోసం కూడా ఉద్యమించాలని అనుకోవడం లేదు. నిరుద్యోగం, యువతకు సరైన అవకాశాలు, రాష్ట్రంలో తగ్గుతున్న పెట్టుబడులు వంటి వాటికి కూడా కాంగ్రెస్సే కారణం అనడమే తప్ప.. వాటి పరిష్కారం కోసం రోడ్డెక్కి కొట్లాడదాం, ఉద్యమించి పరిష్కారాన్ని రాబడదాం అని గతంలో ఉన్న ఫైర్ ఇప్పటి బీఆర్ఎస్‌లో కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా తమది ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ, తమ నెత్తురులోనే ఉద్యమం ఉందని చెప్పడమే కానీ.. ఏ సమస్యపైన కూడా ఉద్యమించడానికి ముందడుగు వేయడం లేదు.

కేటీఆర్ కూడా సభలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టిన ఒక నాలుగు మాటలు అని, ఐదు సెటైర్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు. పైగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిద్దాం, కలిసి పోరాడదాం అని పిలుపునిస్తున్నారు కానీ రంగంలోకి దిగడం లేదు. ఇంకేమైనా అంటే మీడియాలో, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ మరోసారి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. బీఆర్ఎస్ ఇకనైనా ఈ పంథా మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలకు ప్రజలు ఈ పార్టీని మర్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా మాటలతో రాజకీయాల్లో ఉనికిని కాపాడుకోవడం చాలా కష్టం. ఇలాంటి మాటలు, సెటైర్లు నాలుగు రోజులు వార్తల్లో ఉంచుతాయి తప్పితే.. ప్రజల్లో కాదు. ప్రజల్లో ఉండాలి అంటే వారి సమస్యలపై పోరాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల కోసం, ప్రజలతో కలిసి ఉద్యమించాలి. అప్పుడే ప్రజలకు, పార్టీకి మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. పార్టీని ప్రజలు నమ్మడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈవిషయాలు బీఆర్ఎస్ నేతలకూ బాగానే తెలుసు. కానీ మరెందుకో ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడంలో మాత్రం బీఆర్ఎస్ ఉద్యమకారులంతా విఫలమవుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఏంటి..!

ఇప్పటి వరకు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎందుకో కారణం తెలియదు కానీ.. వాటన్నింటికీ బీఆర్ఎస్ దూరంగానే ఉంది. అందుకు కారణాన్ని ఆ పార్టీ నేతలు కూడా చెప్పలేకున్నారు. అలాంటిది ఇప్పుడు అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరో ఆరు నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రానుంది. ఇదే పంథాతో ఆ ఎన్నికల్లో నిలబడితే ఓటమి పలకరించడం ఖాయం. అసలు ఈ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ నిలబడుతుందా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని కేటీఆర్ చెప్పడమే కానీ.. ఎలా అనేది మాత్రం చెప్పడం లేదు. రానున్న ఈ ఎన్నికలు బీఆర్ఎస్ భవిష్యత్తును చెప్తాయేమో చూడాలి.

రానున్న మూడు సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ ఇలానే మాటలతో గడిపేస్తే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అనే పార్టీ ఒకటి ఉండేది అన్నట్లే ప్రజలు ట్రీట్ చేస్తారు. తమకు తెలిసి ఉద్యమ పార్టీ కనుమరుగయిపోయిందే భావిస్తారు. అదే జరిగితే తెలంగాణను సాధించామంటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం వచ్చిన 20 ఏళ్లకే కనుమరుగవుతుంది.

ఉద్యమానికి మారుపేరుగా టీఆర్ఎస్..!

ప్రత్యేక తెలంగాణ ఆశయంతో జన్మించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్). ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ పార్టీ నేతలు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల హక్కులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనే ముప్పై మంత్రములతో ఉద్యమాన్ని మైలురాయిగా మలిచింది. ప్రజా సంక్షేమం కోసం వారు చేసిన ఉద్యమాలతో టీఆర్ఎస్ అంటే ఉద్యమ స్ఫూర్తికి, ఉద్యమానికి మారుపేరుగా మారింది. ప్రజల సమస్యలపై పోరాడే రాజకీయ శక్తిగా అంతా భావించారు. ఆ నమ్మకంతోనే ఉద్యమం ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్‌కు పట్టం కట్టారు. 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంటరిగా 63 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడే కాదు మళ్ళీ రెండోసారి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరింత మెజారిటీ సాధించింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అంటే తొలిసారికన్నా 25 సీట్లు అధికంగా గెలిచింది.

Read More
Next Story