బీఆర్ఎస్ మౌనం అంగీకారమేనా ?
x
KCR, KTR and Harish Rao

బీఆర్ఎస్ మౌనం అంగీకారమేనా ?

ప్రతిపక్షంలో ఉన్నాసరే తమ మాటే చెల్లుబాటు కావాలన్న విచిత్ర వైఖరి వీళ్ళ ఆరోపణలు, విమర్శల్లో స్పష్టంగా తెలుస్తోంది


కథనంలోకి వెళ్ళేముందు బీఆర్ఎస్ అగ్రనేతల వైఖరిగురించి కాస్త చెప్పుకోవాలి. కిందపడ్డా పైచేయి మాదే అని అడ్డంగా వాదించే నేతలు వీళ్ళు. బీఆర్ఎస్ అగ్రనేతలంటే అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్, కల్వకుంట్ల కవిత మాత్రమే. ఈనలుగురిలో కూడా ఇపుడు కవితను పక్కనపెట్టేస్తే మిగిలింది ముగ్గురు మాత్రమే. వీరిలో 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్(KCR) పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైపోయి తెలంగాణ ఎటుపోయినా తనకు అనవసరం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమను ఓడించిన జనాలపై కేసీఆర్ లో మంట తగ్గినట్లులేదు. అందుకనే పార్టీ వ్యవహారాలు మొత్తం కేటీఆర్, హరీష్ కు వదిలేశారు. ఇక వీళ్ళిద్దరి వైఖరి ఎలాగుంటుంది అంటే అధికారంలో ఉంటే తమను ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీయకూడదు అన్నట్లుగా ఉంటుంది. ప్రతివిషయాన్ని రాజకీయంచేసి ప్రభుత్వంపై బురదచల్లేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాసరే తమ మాటే చెల్లుబాటు కావాలన్న విచిత్ర వైఖరి వీళ్ళ ఆరోపణలు, విమర్శల్లో స్పష్టంగా తెలుస్తోంది.

వీళ్ళ వైఖరికి ఉదాహరణలు ఏమిటంటే కాళేశ్వరం అవినీతి, ఫార్ములా కార్ రేసు నిర్వహణలో అధికార దుర్వినియోగం, బనకచర్ల ప్రాజెక్టు విషయాల్లో ప్రభుత్వంపై ప్రతిరోజు చేస్తున్న ఆరోపణలు, విమర్శలే. కాళేశ్వరంలో అవినీతి జరిగినట్లు కళ్ళకు కనబడుతున్నా తమకు ఎలాంటి సంబంధంలేదని అంతా అధికారులే చూసుకున్నారని అడ్డంగా వాదిస్తున్నారు. ఫార్ములా కార్ రేసు(Formula E Car Race)లో అధికార దుర్వినియోగం జరిగిందని అర్ధమవుతున్నా తనకేమీ సంబంధంలేదని కేటీఆర్(KTR) చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక బనకచర్ల ప్రాజెక్టు విషయానికి వస్తే తాము అధికారంలో ఉన్నపుడు గోదావరి నీళ్ళు కృష్ణకు తరలించి వాడుకోవాలని కేసీఆర్ అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం సమక్షంలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోను తర్వాత ప్రగతిభవన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) భేటీలో కూడా కేసీఆర్ ఇదే నిర్ణయాన్ని ప్రకటించారు. అలాంటిది ఇపుడు మాత్రం గతంలో కేసీఆర్ ప్రకటనకు విరుద్ధంగా హరీష్(Harish Rao) వాదిస్తున్నారంటే కారణం తాము ప్రతిపక్షంలో ఉండటమే.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే పైన చెప్పిన ఉదాహరణలకు భిన్నంగా బీఆర్ఎస్ మరో అంశంలో వ్యవహరిస్తోంది. ఆ అంశం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping). అధికారంలో ఉన్నపుడు వేలాది మొబైల్ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించారు. రాజకీయ బాసుల ఆదేశాలు లేకుండా ఉన్నతాధికారులు తమంతట తాముగా నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్ చేసే అవకాశాలు తక్కువ. ట్యాప్ చేసిన ఫోన్లన్నీ బీఆర్ఎస్ రాజకీయ వ్యతిరేకుల ఫోన్లే అని బయటపడుతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉన్నారని కొందరి ఫోన్లను, వ్యతిరేకంగా ఉన్నారన్న అనుమానంతో మరికొందరి ఫోన్లను, కాంగ్రెస్ కు సహకరిస్తున్నారనే అనుమానాలతో ఇంకొందరి ఫోన్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ టీ ప్రభాకరరావు ద్వారా వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించిందన్నది వాస్తవం. విచారణ లోతుల్లోకి వెళ్ళేకొద్ది విస్తుపోయే విషయాలు ప్రతిరోజూ బయటపడుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు కాళేశ్వరం, ఫార్ములా కార్ రేసు, బనచకర్ల అంశంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. లాజికల్ గానో అడ్డంగానో కేటీఆర్, హరీష్ తమమీద ఆరోపణలు, విమర్శలపై ఎదురుదాడులు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నేతలు టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్, కేటీఆర్ పై ఎన్నిఆరోపణలు, విమర్శలు చేస్తున్నా నోరిప్పటంలేదు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్ళటం ఖాయమని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth), కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) తో పాటు మంత్రులు, బీజేపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఏమాత్రం స్పందించని విషయాన్ని అందరు గమనిస్తున్నారు. ట్యాపింగ్ ఆరోపణలపై కనీసమాత్రంగా కూడా నోరిప్పి మాట్లాడటంలేదంటే తాము తప్పుచేసినట్లు అంగీకరిస్తున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

బీఆర్ఎస్ హయాంలో వేలాది ఫోన్లు ట్యాపయ్యింది వాస్తవం. ట్యాపింగ్ లో పాల్గొన్న అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. బాస్ గా పనిచేసిన ప్రభాకరరావు, ఏ1 నిందితుడు ఆదేశాలతోనే తాము ట్యాపింగ్ చేసినట్లు కోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లలో కూడా స్పష్టంగా చెప్పారు. ప్రభాకరరావు విచారణలో బయటపడాల్సింది ఏమిటంటే తనకు ట్యాపింగ్ ఆదేశాలు ఇవ్వటంతో పాటు వ్యక్తుల పేర్లు, నెంబర్లు ఇచ్చింది ఎవరని మాత్రమే. ఇదే విషయమై బండి సంజయ్ మాట్లాడుతు ఈ కేసును సీబీఐ దర్యాప్తుచేసుంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, ప్రభాకరరావును గుంజుకుపోయి జైల్లో పడేసేదని చెప్పారు. జైలుశిక్ష తప్పదు, చిప్పకూడు తప్పదని రేవంత్, బండి లాంటి వాళ్ళు ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ నుండి ఒక్కమాట కూడా గొంతులో నుండి రావటంలేదంటే అర్ధమేంటి ? మౌనం అంగీకారమన్నట్లేనా ?

Read More
Next Story