
తెలుగు రాజకీయాల్లో మళ్లీ మెగా సౌండ్.. చిరంజీవికి బీజేపీ గాలం వేస్తోందా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్... నడవాల్సిన బిజెపి రూట్లో చిరు స్పీడ్ బ్రేక్ అవుతారేమో.
ఆంద్రప్రదేశ్ లో బిజెపి రూట్ మ్యాప్ మార్చిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్... నడవాల్సిన బిజెపి రూట్లో చిరు స్పీడ్ బ్రేక్ అవుతారేమో. ఇంత కాలం పవన్ తో మైండ్ గేమ్ ఆడుతూ వచ్చిన బిజెపి మెగాస్టార్పై ఎందుకు ఆసక్తి చూపుతోంది. రాజకీయాల నుంచి తెర మరుగై పోయిన చిరంజీవిని, భీమవరంలో అల్లూరి సభకు ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చో పెట్టడం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆ కార్యక్రమానికి జనసేనానికి కనీసం ఆహ్వానం పంపలేదు.
ఇప్పుడేమో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఇటీవల ఓ లీక్ వదిలారు. చాలా మంది సినీ ప్రముఖులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ తాను పిలిస్తే తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారని వ్యాఖ్యానించడం వెనుక మతలబేమిటని తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చిరంజీవిని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి ఇమేజ్ ని వాడుకునేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
సినీ హీరోగా చిరంజీవి వేసిన స్టెప్స్ తెలుగు ప్రజలను ఉత్సాహంతో ఊగిపోయేలా చేశాయి. కానీ రాజకీయాల విషయానికి వచ్చే సరికి చిరంజీవి వేసిన స్టెప్స్ గతి తప్పాయని చెప్పుకోవచ్చు. ప్రజలు బ్రహ్మరథం పడతారనుకుని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కొద్ది కాలానికే చతికిలా పడింది. 2009 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రినవుతాననుకున్న చిరంజీవికి 294 సీట్లలో దక్కింది కేవలం 18 సీట్లే దక్కాయి.ప్రజలిచ్చిన తీర్పుతో ఖంగుతిన్న మెగాస్టార్ ఆ తర్వాత స్లోగా తన పంథా మార్చుకున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోవడంతో చిరంజీవి సైలెంట్ అయిపోయారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ చిరంజీవి తన పార్టీ సభ్యుడే అని చెప్తున్నా… మెగాస్టార్ మాత్రం ఆ పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి చాలాకాలం అయింది. ఇటీవల పలు వేదికల్లో రాజకీయాలపై మాట్లాడిన చిరంజీవి.. అవి తన మనస్తత్వానికి సరిపోవని తేల్చేశారు. అక్కడ మాటలు అనాలి.. అనిపించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాజకీయ రంగం నుంచి పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయారు.
150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సైరా, నరసింహారెడ్డితో మరోసారి ప్రేక్షకులను అలరించారు.
చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ.. ఆయన చుట్టూ రాజకీయం మాత్రం నడుస్తూనే ఉందని చెప్పొచ్చు. ఆయన ఎక్కడికెళ్లినా రాజకీయాలు గురించి మాట్లాడాల్సి వస్తోంది. తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి యాక్టివ్ గా ఉంటున్నారు. పవన్ కల్యాణ్ పట్టుదల కలిగినవాడని.. కచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో చూస్తామని చిరంజీవి ఈ మధ్య వ్యాఖ్యానించారు. పవన్ నా తమ్ముడు.. సందర్భం వస్తే ఆయన కోసం పనిచేస్తానేమో అని కూడా చిరంజీవి అన్నారు. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అని.. మెగా స్టార్ పలికిన డైలాగ్ను ఇప్పుడు మళ్ళీ తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ బీజేపీతో కలసి పని చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు చిరంజీవిని తమకు దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్ద నెట్ వర్క్ లేదు. ఇప్పుడు జనసేన, టిడిపి స్నేహం ద్వారా కాస్తోకూస్తో బీజేపీకి లబ్ది కలగడం ఖాయం. వీరికి చిరంజీవి కూడా తోడైతే అది మరింత ఊపు తెస్తుందని బీజేపీ భావిస్తన్నట్లుంది. బీజేపీ – జనసేన – చిరంజీవి కలిస్తే కచ్చితంగా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలుంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే చిరంజీవి ఇమెజ్ ఏదో ఒక రూపంలో వాడుకోవాలనుకుంటోంది. చిరంజీవి కూడా తనకు ఏదైనా ప్రధాన పదవి ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారనే సమాచారం కూడా అందుతోంది. మరి చిరంజీవి మదిలో ఏముందో.. బీజేపీ ఎలాంటి స్కెచ్ వేస్తోందని రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.