
అందరి దృష్టి క్యాబినెట్ సమావేశంపైనేనా ?
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా కీలకమైనవన్న విషయం తెలిసిందే
తెలంగాణలో అన్నీ రాజకీయపార్టీల దృష్టి క్యాబినెట్ సమవేశపైనే ఉంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రతినెలా జరిగే క్యాబినెట్ సమావేశానికి ఈసారి ఎందుకింత ప్రాధాన్యత ? ఎందుకంటే మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపై చర్చ జరగబోతోంది కాబట్టే. రాజీవ్ యువ వికాశం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ-నిర్మాణం, భూభారతిపై సమీక్ష, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్టు, ప్రాజెక్టు వినియోగం విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టి అథారిటి(ఎన్డీఎస్ఏ) రిపోర్టు, ఉద్యోగుల డిమాండ్లపైన మంత్రివర్గ సమావేశంలో చర్చలుంటాయి.
వీటిల్లో కూడా రాజీవ్ యువవికాశం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా కీలకమైనవన్న విషయం తెలిసిందే. ఎన్డీఎస్ఏ రిపోర్టును బీఆర్ఎస్ కీలకనేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao), కవిత(Kavitha) కొట్టిపారేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదని ఎన్డీయే రిపోర్టంటు కేటీఆర్, హరీష్ ఎద్దేవా చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎందుకు ఎద్దేవా చేస్తున్నారంటే రిపోర్టులోని అంశాలు అలాగున్నాయమరి. కేసీఆర్(KCR) ఎంతో ప్రిస్టేజిగా తీసుకుని దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండా పోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మించిన మూడేళ్ళల్లోనే పనికిరాకుండా పోయిందంటే వేలాది కోట్ల ప్రజాధనం ఎంతగా వృధా అయ్యిందో అర్ధమవుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులు కూడా నీటినిల్వకు పనికిరాకుండా పోయాయి. మేడిగడ్డ బ్యారేజీలోని ఒకబ్లాకులో మూడుపిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. కుంగిపోయిన పిల్లర్లకు పగుళ్ళు వచ్చేశాయి. దీనికారణంగా డ్యాం ప్లాట్ ఫారమ్ కూడా చీలికలు వచ్చేశాయి. అందుకనే మేడిగడ్డ బ్యారేజీ నీటినిల్వకు పనికిరాదు. ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్డీఎస్ఏ నిపుణులు కాళేశ్వరం, మేడిగడ్డ నీటినిల్వకు పనికిరాదని తేల్చేశారు. పిల్లర్లకు రిపేర్లుచేసినా నిలిచేది అనుమానమే అన్నారు. అలాగే బ్యారేజీ వాడకానికి చాలా సూచనలు చేశారు. నివేదిక మొత్తం తమకు వ్యతిరేకంగా ఉందికాబట్టే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విచారణలో ఎన్డీఎస్ఏ రిపోర్టును పరిగణలోకి తీసుకున్నది. విచారణ పూర్తయిన తర్వాత కమిషన్ ఇవ్వబోయే రిపోర్టులో ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రభావం ఉంటుందన్న ఆలోచనే కారుపార్టీ అగ్రనేతల్లో టెన్షన్ పెంచేస్తోంది. తమలోని టెన్షన్ను దాచిపెట్టేందుకే ప్రభుత్వంతో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్టుపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇంతటి కీలకమైన రిపోర్టును మంత్రివర్గం చర్చించబోతోంది. మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న టెన్షన్ గులాబిపార్టీలో పెరిగిపోతున్నట్లుంది. అలాగే భూభారతి డెవలప్మెంట్లపైన కూడా మంత్రివర్గం చర్చించబోతోంది.
కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన ధరణి పోర్టల్ స్ధానంలో రేవంత్(Revanth) ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ ఆధారంగా అప్పట్లో జరిగిన అధికార దుర్వినియోగం, అవినీతిపైన కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. ఇంతటి కీలకమైన అంశాలపైన క్యాబినెట్ చర్చించబోతోంది కాబట్టే అందరి దృష్టి ఇపుడు గురువారం జరగబోయే సమావేశంపైన ఉంది. మరి చర్చలు ఎలాగుంటాయో ? క్యాబినెట్ ఏమి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.