
రేవంత్ కు ‘బంపర్ లాటరీ’ తగులుతుందా ?
భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రు. 20 వేల కోట్లుంటుంది
తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్టు లేదా డిమాండును కేంద్రప్రభుత్వం అంగీకరిస్తే ఎనుముల రేవంత్ రెడ్డి(Revnth) బంపర్ లాటరీ కొట్టినట్లే అనుకోవాలి. విషయం ఏమిటంటే హైదరాబాద్(Hyderabad) చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్రప్రభుత్వ పరిధిలోని ఆరు ప్రభుత్వ రంగంసంస్ధల దగ్గర నిరుపయోగంగా వేలాది ఎకరాల భూమి ఉంది. నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగి రాష్ట్రానికి స్వాదీనం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కేంద్ర పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామిని రిక్వెస్టుచేశారు. ఇదేవిషయమై గతంలోనే రేవంత్ ఢిల్లీ పర్యటనల్లో నరేంద్రమోదీ(Narendra Modi)తో పాటు కుమారస్వామిని విజ్ఞప్తిచేయటమే కాకుండా లేఖలు కూడా రాశారు.
1960వ దశకంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం కొన్నిసంస్ధలను ఏర్పాటుచేయాలని అనుకున్నది. ఇందుకు రాష్ట్రప్రభుత్వం 7,183 ఎకరాలను కేంద్రప్రభుత్వానికి కేటాయించింది. ప్రారంభించినపుడు బాగా నడిచిన ప్రభుత్వ రంగం సంస్ధలు వివిధ కారణాలతో తర్వాత మూతపడ్డా. మూతపడిన సంస్ధలకు కేటాయించిన భూములు దశాబ్దాలుగా వృధాగా పడున్నాయి. ఇపుడా భూములనే తిరిగి రాష్ట్రప్రభుత్వానికి స్వాదీనం చేసేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్ గిరిలో హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ సంస్ధకు 325 ఎకరాలు, ఐడీపీఎల్ కు 551 ఎకరాలు, హెచ్ఎంటీకి 888, సంగారెడ్డిలోని హిందుస్తాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ సంస్ధకు 126 ఎకరాలు, ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 2,272 ఎకరాలు, సంగారెడ్డి ఎద్దుమైలారంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 3020 ఎకరాలను 1960ల్లో రాష్ట్రప్రభుత్వం కేటాయించింది.
ఇదే విషయాన్ని దుద్దిళ్ళ కేంద్రమంత్రితో మాట్లాడుతు రెండు రిక్వెస్టులు చేశారు. మొదటిది ఏమిటంటే మూతపడిన సంస్ధలను తెరిపించి ఉద్యోగ, ఉపాధి కల్పించాలని. రెండో రిక్వెస్టు ఏమిటంటే మూతపడిన సంస్ధలను తెరిపించటం సాద్యంకాదని అనుకున్నపుడు నిరుపయోగంగా ఉన్న భూములను రాష్ట్రప్రభుత్వానికి స్వాధీనం చేసేయాలని.
ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్టులో కేంద్రప్రభుత్వం ఏదిచేసినా రేవంత్ కు ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. ఎలాగంటే మూతపడిన ఆరు సంస్ధలను కేంద్రప్రభుత్వం తిరిగి తెరిపిస్తే తెలంగాణలోని వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఒకవేళ పున:ప్రారంభానికి అంగీకరించకపోతే నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగిచ్చినా చాలు. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుపయోగంగా ఉన్న వేలాది ఎకరాల భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రు. 20 వేల కోట్లుంటుంది. నిరుపయోగంగా ఉన్న భూములను కేంద్రం స్వాదీనం చేయగానే రాష్ట్ర ప్రభుత్వం వాటిని బహిరంగ మార్కెట్లో వేలం ద్వారా అమ్మాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.
అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు అందక తెలంగాణ ప్రభుత్వం నానా అవస్తలుపడుతోంది. ఈవిషయాన్ని స్వయంగా రేవంతే చాలాసార్లు బహిరంగసభల్లో చెప్పారు. రాష్ట్రప్రభుత్వ ఆర్ధికపరిస్ధితి చాలా అధ్వాన్నంగా ఉందన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఈ పరిస్ధితుల్లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU) 400 ఎకరాల భూములను కార్పొరేట్ సంస్ధలకు కేటాయించాలని రేవంత్ చేసిన ప్రయత్నాలు బాగా వివాదాస్పదమయ్యాయి. ఇటువంటి పరిస్ధితుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా భూములున్నాయి కాని చాలావరకు వివాదాల్లో ఉన్నాయి. అందుకని ఇపుడు కేంద్రప్రభుత్వం గనుక తెలంగాణ ప్రభుత్వం అడిగినట్లుగా నిరుపయోగంగా ఉన్న వేలాదిఎకరాలను గనుక స్వాధీనంచేసేస్తే రేవంత్ కు బంపర్ లాటరీ తగిలినట్లుగానే అనుకోవాలి. మరి కేంద్రప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.