
కేటీఆర్ లో ‘కాళేశ్వరం’ టెన్షన్ పెరిగిపోతోందా ? కాంగ్రెస్సే బాంబులు పెట్టిందట
కాసుల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను కూల్చేసి టెండర్లుపిలిచి 20-30 శాతం కమీషన్లు నొక్కేయటానికి రేవంత్ వ్యూహం ఆలోచనగా కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో విచారణ టెన్షన్ కేటీఆర్ లో బాగా పెరిగిపోతున్నట్లుంది. టెన్షన్ పెరిగిపోతున్న వాళ్ళు మాత్రమే ఇపుడు కేటీఆర్ మాట్లాడినపుడు మాట్లాడుతారు. ఇంతకీ విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పగుళ్ళకు కాంగ్రెస్ పార్టీయే కారణమేమో అనే సందేహాన్ని కేటీఆర్(KTR) వ్యక్తంచేశారు. ఇంకా ఇలాంటి సందేహంతో రేవంత్ ప్రభుత్వం మీద కేటీఆర్ బురదచల్లలేదేమిటా అని అనుకుంటున్న వాళ్ళ సందేహాన్ని కేటీఆర్ తీర్చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లపగుళ్ళకు కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. బ్యారేజీలో రెండుచోట్ల పగుళ్ళు వస్తే ఏదో అయిపోయినట్లు రేవంత్, మంత్రులు నానా గోలచేస్తున్నట్లు కేటీఆర్ ఎద్దేవాచేశారు. కాసుల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను కూల్చేసి టెండర్లుపిలిచి 20-30 శాతం కమీషన్లు నొక్కేయటానికి రేవంత్ వ్యూహం ఆలోచనగా కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)తో పాటు అనుబంధంగా మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలను నిర్మించింది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నపుడే 2023 ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని మూడు పిల్లర్లు కుంగిపోయిన విషయం బయటపడింది. అంటే బ్యారేజీల నిర్మాణం జరిగింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే, పిల్లర్లు కుంగిపోయి పగుళ్ళు వచ్చిందీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే. ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నపుడు కాని నిర్మాణం పూర్తియిన తర్వాత కాని కేసీఆర్(KCR) ప్రభుత్వం ఎవరినీ ప్రాజెక్టు, బ్యారేజీల చుట్టుపక్కలకు కూడా పోనివ్వలేదు. అలాంటపుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను కాంగ్రెస్ నేతలు బాంబులుపెట్టి ఎలా పేల్చగలరు ?
ఇటువంటి వ్యాఖ్యలతోనే కేటీఆర్ లో కాళేశ్వరం టెన్షన్ పెరిగిపోతోందన్న విషయం అర్ధమవుతోంది. కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై జూన్ 5వ తేదీన విచారణకు రమ్మని పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీచేసింది. బ్యారేజీలో అవినీతి జరిగింది వాస్తవం, అవకతవకలు జరిగింది వాస్తవమని అనిచెప్పిన చాలామంది అందుకు కారణం అప్పటి పాలకులే అని విచారణకు హాజరైన చాలామంది సాక్ష్యాలతో సహా అఫిడవిట్లు దాఖలుచేశారు. ఇపుడు తేలాల్సింది ఏమిటంటే కేసీఆర్ విచారణకు హాజరవుతారా ? లేదా అనిమాత్రమే. విచారణకు హాజరైతే కేసీఆర్ ఏమిచెబుతారు ? హాజరయ్యే ఉద్దేశ్యంలేకపోతే కారణం ఏమనిచెబుతారు ? అనిమాత్రమే తేలాలి. ఒకవేళ కేసీఆర్ తో పాటు అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు(Harish rao) కూడా కాళేశ్వరం అవినీతిలో ఇరుక్కుంటే పార్టీ పరిస్ధితి ఏమిటనే విషయంలో కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతున్న విషయం అర్ధమవుతోంది.