
కవిత.. కేసీఆర్ వైఫల్యాలను బయటపెడుతున్నారా..?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలోని అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం ఇలా అనేక అంశాలను ఆమె లేవనెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న భద్రాచలం డివిజన్లోని ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, భద్రాచలం నెత్తిన ఉన్న పురుషోత్తపట్నం, దానికి ఆనుకొని ఉన్న గుండాల.. ఐదు గ్రామాల వ్యవహారాన్ని తాజాగా ఆమె లేవనెత్తారు. ఐదు గ్రామాలను తెలంగాణ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచాలన్న ఏపీ ప్రభుత్వ ఆలోచనను ఆమె తప్పుబట్టారు. అలా చేయడం ద్వారా తెలంగాణ బ్యాక్ వాటర్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే జరిగితే భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే పోలవరం ముంపుపై సంయుక్త సరవే నిర్వహించాలని, ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కూడా డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రధాని ముందుకు తీసుకెళ్లాలని కూడా డిమాండ్ చేశారామే.
ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలే తెలంగాణ అంతటా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా లేదా కేసీఆర్ వైఫల్యాలను బజారున పెడుతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించని అంశాలను మాత్రమే కవిత ఇప్పుడు లేవనెత్తుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కవిత లేవనెత్తుతున్న అన్న సమస్యలు కూడా ఎప్పటి నుంచో ఉన్నవేనని, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావని గుర్తు చేస్తున్నారు. ఈ సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కవిత ఎందుకు ప్రశ్నించలేదన్న చర్చ కూడా జరుగుతోంది.
బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అసెంబ్లీలో జ్యోతిరావు బా పూలే విగ్రహ ఏర్పాటు వంటి అంశాలను కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లేవనెత్తడం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కేసీఆర్దే. 2014-2019 మధ్య కవిత.. నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె ఈ సమస్యలు వేటినీ లేవనెత్తలేదు. కనీసం వీటిపై తండ్రితో చర్చించారో లేదో కూడా తెలీదు. ఆ తర్వాత 2019 నుంచి ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆ సమయంలో కూడా ఆమె రాష్ట్రంలోని అనేక సమస్యలను లేవనెత్తలేదు. కానీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కవితకు ఈ సమస్యలన్నీ కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు ఆలోచన వచ్చి ఉన్నా ఇవన్నీ కూడా పరిష్కారం అయి ఉండేవి.
అదే విధంగా భద్రాచలంలోని ఐదు గ్రామాల వ్యవహారం కూడా చాలా కాలం కొనసాగింది. ఆ సమయంలో కూడా కవిత పెద్దగా స్పందించలేదు. అప్పుడు తెలంగాణ నుంచి గట్టిపోరాటం జరగలేదు. దాంతో అవి కాస్తా ఏపీలో కలిసిపోయాయి. వాటి గురించి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఏం మాట్లాడలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే అంశాన్ని కవిత లేవనెత్తుతుండటం విశేషంగా మారింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఐదు ముంపు గ్రామాలు కవితకు కానరాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. లేదా.. ఇవన్నీ కూడా పదేళ్లు అధికారంలో ఉండి కూడా తమ తండ్రి చేయలేకపోయారంటూ ఇప్పుడు చెప్పకనే చెప్తున్నారా?
ఇదొక్కటే కాదు.. మరికొన్ని అంశాల్లో కూడా కవిత ప్రవర్తన చూస్తుంటే.. కాంగ్రెస్ కన్నా.. ఆమె టార్గెట్ ఎక్కువ కేసీఆర్ వైఫల్యాలే అన్నట్లు ఉంది. ఆమె లేవనెత్తే అంశాలు ఈ వాదనను బలోపేతం చేస్తోంది. పార్టీ పదవుల విషయంలో వచ్చిన విబేధాలతోనే కవిత.. లేఖాస్త్రంతో మొదలుపెట్టి.. కేసీఆర్ చేయని అన్ని పనులను కూడా కాంగ్రెస్ను నిలదీస్తున్న సాకుతో ప్రజల ముందు ఉంచుతున్నారని చర్చ జోరుగా సాగుతోంది.