వరంగల్ జిల్లాలో ఇంటిపోరు: సురేఖకు భర్త, యశశ్వినికి అత్తపోరు పెరిగిపోతోందా ?
x
Konda Murali and Jhansi

వరంగల్ జిల్లాలో ఇంటిపోరు: సురేఖకు భర్త, యశశ్వినికి అత్తపోరు పెరిగిపోతోందా ?

ప్రజాప్రతినిధులు లేదా మంత్రులకు తలనొప్పులు బయటనుండి కన్నా ఇంట్లో నుండే ఎక్కువగా ఉంటుంది.


ప్రజాప్రతినిధులు లేదా మంత్రులకు తలనొప్పులు బయటనుండి కన్నా ఇంట్లో నుండే ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళు మంత్రయితే ఎక్కువగా సంతానం నుండి తలనొప్పులు వస్తాయి. మంత్రిగా ఆడవాళ్ళుంటే భర్త నుండే కాకుండా బోనస్ గా సంతానం నుండి కూడా తలనొప్పులు తప్పవు. అల్లుడో లేకపోతే కోడలో యాక్టివ్ గా ఉంటే మంత్రి, ప్రజాప్రతినిధులకు మరిన్ని తలనొప్పులు తప్పవనే చెప్పాలి. ఎంఎల్ఏలకు ఒక తలనొప్పయితే మంత్రయితే మరోరకమైన తలనొప్పులు తప్పవంతే. అందరి విషయంలో కాకపోయినా చాలామంది విషయాల్లో ఇదే జరుగుతుంటుంది. ఇపుడు విషయం ఏమిటంటే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కు భర్త కొండా మురళి(Konda Murali) నుండి బాగా తలనొప్పులు పెరిగిపోతున్నాయి. సురేఖ ప్లస్సూ, మైనస్సూ రెండూ కొండా మురళినే కావటం గమనార్హం. అలాగే పాలకుర్తిలో పోటీచేసిన మొదటిసారే గెలిచిన మామిడాల యశశ్వినికి అత్తగారు జాన్సీ నుండి తలనొప్పులు పెరిగిపోతున్నాయని పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. భర్తను కంట్రోల్ చేయలేక సురేఖ, అత్తగారిని కంట్రోల్ చేయలేక యశశ్విని పడుతున్న బాధలు అంతా ఇంతా కాదని పార్టీలో కూడా టాక్ నడుస్తోంది.

ఇపుడు విషయం ఏమిటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు వ్యతిరేకంగా చాలామంది ఎంఎల్ఏలు, ఎంపీ, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు ఏకమయ్యారు. నిజానికి మంత్రి సురేఖ మీద వ్యతిరేకవర్గానికి అంతస్ధాయిలో వ్యతిరేకత లేదు. అయితే సురేఖ భర్త మురళి కారణంగానే వ్యతిరేకవర్గం మంత్రిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం కొండా మురళి వైఖరికి వ్యతిరేకంగా నాయిని రాజేంద్రరెడ్డి క్యాంపు ఆఫీసులో ఎంఎల్ఏలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్యతో పాటు మరికొందరు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. వీళ్ళంతా మంత్రి, ఆమె భర్త వ్యవహార శైలికి వ్యతిరేకంగా జట్టుకట్టి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు అధిష్ఠానం నేతలకు కూడా ఫిర్యాదులు చేశారు.

మంత్రి పరిస్ధితి ఏమిటంటే భర్తను కంట్రోల్ చేయలేరు, భర్తను కాదని ఒక్కడుగు కూడా ముందుకు వేయలేరు. ఎందుకంటే సురేఖ రాజకీయ ప్రస్ధానం అంతా మురళిపైనే ఆధారపడుంది. మంత్రి గెలుపు, ఓటమి అంతా మురళి మీదే ఆధారపడుందన్న విషయం అందరికీ తెలుసు. అందుకనే భర్త మురళి ఎలాచెబితే మంత్రి అలా నడుచుకోక తప్పటంలేదు. ఇపుడు తనకు వ్యతిరేకంగాతయారైన గ్రూపును కట్టడిచేయలేక మంత్రి ఇబ్బందులు పడుతున్నారు. ఈ వివాదం చివరకు ఎక్కడిదాకా వెళుతుందో చూడాల్సిందే.

కొండా సురేఖ వ్యవహారం అలాగుంటే పాలకుర్తి ఎంఎల్ఏ మామిడాల యశశ్వని వ్యవహారం మరోలాగుంది. చదువు అయిపోగానే వివాహంచేసుకుని యశశ్వి(Palakurti MLA Yasaswini)ని అమెరికాకు వెళ్ళిపోయింది. అలాంటిది పాలకుర్తిలో పోటీచేసేందుకు కాంగ్రెస్(Telangana Congress) టికెట్ రాగానే అమెరికానుండి వచ్చి పోటీచేసింది. పోటీచేసిన మొదటిసారే గెలిచింది. దాంతో చిన్నవయసులోనే ఎంఎల్ఏ అయ్యిందనే క్రెడిట్ యశశ్వనికి దక్కింది. అయితే ఈక్రెడిట్ ఎంతోకాలం నిలవలేదు. కారణం ఏమిటంటే అత్తగారు జాన్సీరెడ్డి రూపంలో ఎంఎల్ఏ క్రెడిట్ ఆవిరి అయిపోతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే నియోజకవర్గంలో ఎంఎల్ఏకన్నా అత్తగారు జాన్సీ పెత్తనం రోజురోజుకు పెరిగిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. యశశ్విని పేరుకు మాత్రమే ఎంఎల్ఏకాని క్షేత్రస్ధాయిలో మాత్రం జాన్సీనే ఎంఎల్ఏగా చెలామణి అయిపోతున్నారనే సెటైర్లు పెరిగిపోతున్నాయి. ఈ ప్రచారం యశశ్విని దృష్టికి కూడా వచ్చిందని అయినా ఏమీచేయలేక బాధపడుతున్నారని టాక్

ఇక్కడ ఎంఎల్ఏ సమస్య ఏమిటంటే అసలు పాలకుర్తిలో పోటీచేయాల్సింది జాన్సీయే. ఎన్నికలకు చాలాకాలం ముందునుండే జాన్సీ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ నేతలందరినీ ఏకంచేశారు. అలాగే అప్పటి బీఆర్ఎస్ ఎంఎల్ఏ, మంత్రయిన ఎర్రబెల్లి దయాకర్ వ్యతిరేకులను కూడా కూడదీశారు. అనుకున్నట్లుగా ఎన్నికల్లో అధిష్టానం జాన్సీకే టికెట్ కేటాయించింది. అయితే చాలాకాలంగా ఎన్ఆర్ఐ హోదాలో అమెరికా-వరంగల్ మధ్య తిరుగుతున్న జాన్సీకి పోటీచేయటానికి సాంకేతిక కారణాలు అడ్డువచ్చాయి. దాంతో వేరేదారిలేక చివరి నిముషంలో తనకు వచ్చిన టికెట్ ను కోడలు యశశ్విని పేరుకు మార్చి మళ్ళీ బీ ఫారం తెప్పించుకున్నారు. వెంటనే యశశ్విని అమెరికా నుండి పాలకుర్తికి వచ్చి పోటీచేసి గెలిచారు. పాలకుర్తిలో యశశ్విని గెలుపులో అత్తగారిదే నూరుశాతం కష్టమని అర్ధమవుతోంది.

అందుకని ఇపుడు జాన్సీ ఏమిచేస్తున్నారంటే తానే డిఫాక్టోఎంఎల్ఏగా నియోజకవర్గంలో చెలామణి అయిపోతున్నారట. ఏ విషయంలో అయినా ఎంఎల్ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎవరు ఎంఎల్ఏని కలవాలన్నా ముందు జాన్సీని కలవాల్సిందే అనే ప్రచారం పార్టీతో పాటు నియోజకవర్గంలో కూడా పెరిగిపోతోంది. స్వతంత్రంగా వ్యవహరించలేక, అత్తగారిని కంట్రోల్ చేయలేక ఎంఎల్ఏ యశశ్విని నానా అవస్తలు పడుతోందని టాక్. చూశారా ఇంటిపోరు ఎంతటి తలనొప్పులు తెస్తుందో.

Read More
Next Story